Tata Chief Air India Chairman |టాటా సన్స్ సొంతం చేసుకున్న ఎయిరిండియా నూతన చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ నియమితులు అయ్యారు. సోమవారం జరిగిన ఎయిరిండియా బోర్డు సమావేశంలో చైర్మన్గా టాటా సన్స్ చీఫ్ చంద్రశేఖరన్ను నియమిస్తూ తీర్మానించింది. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాజీ సీఎండీ అలీసీ జీవర్ఘీస్ వైద్యన్ను బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించింది. వీరిద్దరి నియామకానికి సెక్యూరిటీ క్లియరెన్స్లను కూడా ఎయిరిండియా బోర్డు ఇచ్చేసింది. టాటా సన్స్ చైర్మన్గా చంద్రశేఖరన్ గత నెలలో మరో ఐదేండ్ల పదవీ కాలం పొడిగింపు తర్వాత ఆయన ఎయిరిండియా చైర్మన్గా నియమితులయ్యారు.
ఎయిరిండియాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సంస్థకు నూతన సీఈవో కోసం టాటా సన్స్ వెతుకుతున్నది. టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ సీఈవో ఇల్కర్ ఐకీని మహారాజ సీఈవోగా నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఎయిరిండియా బోర్డు పునర్వ్యవస్థీకరణలో భాగంగా హెచ్యూఎల్ చైర్మన్ సంజీవ్ మెహతాను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. కొత్తగా ఏర్పాటైన ఎయిరిండియా బోర్డు మంగళవారం సంస్థ పూర్వ వైభవానికి తీసుకునే చర్యలపై ప్రకటన చేయనున్నదని భావిస్తున్నారు.
అంతకుముందు ఎయిరిండియా బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు చంద్రశేఖరన్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని మహారాజ ప్రధానకార్యాలయానికి చేరుకున్నారు. సంస్థ పూర్వ వైభవం తేవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన డిటైల్డ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత జనవరిలో ఎయిరిండియాను టాటా సన్స్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే.