ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ సీనియర్ నేత, సహకార సంఘం డైరెక్టర్ తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ, ఆధిపత్య అంశాలే ఈ హత్యకు కారణంగా తెలుస్తున్నది. సహకార సంఘం డైరెక్టర్ హోదాలో కృష్ణయ్య సోమవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు రైతు వేదిక వద్ద పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తన అనుచరుడు ముఖేశ్తో కలిసి బైక్పై తిరిగి వస్తున్నారు.
ఆయన కదలికలను గమనిస్తూ వెం టాడిన దుండగులు.. తెల్దారుపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సమీపంలో ఉన్న దోభీఘాట్ వద్ద కృష్ణయ్య ప్రయాణిస్తున్న బైక్ను ఆటోతో ఢీకొట్టారు. వెనుక కూర్చున్న కృష్ణయ్య కింద పడిపోగానే కత్తులతో దాడి చేశారు. తొలుత రెండు చేతులనూ నరికేశారు.
తల భాగంపై విచక్షణారహితంగా నరికారు. కృష్ణయ్యతో ఉన్న ముఖేశ్.. ప్రాణభయంతో పరుగులు తీశాడు. హత్య చేసిన దుండగులు అదే ఆటోలో పారిపోయారు. దోభీఘాట్ స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దుండగులు ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగానే ఎంచుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. కృష్ణయ్య హత్యతో తెల్దారుపల్లి అట్టుడికి పోయింది. ఆయన అభిమానులు కట్టలు తెంచుకున్న ఆవేశంతో గ్రామంలోని తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు.
కృష్ణయ్య మరణానికి కారకులంటూ ఆరోపించారు. ఇంట్లో ఉన్న కారు, బైకులు, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను నిలువరించారు. మొదట్లో సీపీఎంలో పనిచేసిన కృష్ణయ్య.. కొన్నేండ్ల క్రితం టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడిగా ఉన్నా రు. ఇదే గ్రామానికి చెందిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దగ్గరి బంధువు కృష్ణయ్య.
తెల్దారుపల్లిలో గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణయ్య భార్య విజయం సాధించారు. సహకార ఎన్నికల్లోనూ కృష్ణయ్య టీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. అప్పటివరకు ఏకపక్షంగా ఉన్న తెల్దారుపల్లి రాజకీయాల్లో ఈ రెండు ఎన్నికలతో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామంలో క్రమంగా టీఆర్ఎస్ బలపడుతుండటంతో రాజకీయ పోరు తారస్థాయికి చేరుకున్నది. ఈ క్రమంలోనే కృష్ణయ్య హత్యకు గురయ్యారు.
కృష్ణయ్య హత్య ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతదేహాన్ని చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. కృష్ణయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. తన భర్త హత్యకు తమ్మినేని కోటేశ్వరరావు, వీరభద్రమే కారకులంటూ విలపిస్తూ కృష్ణయ్య భార్య, ఎంపీటీసీ మంగతాయి.. తమ్మినేనికి వివరించారు.
హత్యా రాజకీయాలు సరికాదని, ఈ తరహా ఘటనలు టీఆర్ఎస్ సహించబోదని తుమ్మల స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వీరయ్య తదితరులు కృష్ణయ్య మృతదేహానికి నివాళులర్పించారు. ఘటన జరిగిన తీరుపై ముఖేశ్ను పోలీసులు ప్రశ్నించారు. కృష్ణయ్య హత్యలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్టు భావిస్తున్నారు. అదనపు డీసీపీలు శబరీశ్, సుభాశ్ చంద్రబోస్ గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.