చెన్నై : ఉచిత పధకాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తమిళనాడు ఆర్ధిక మంత్రి డాక్టర్ పీ త్యాగరాజన్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ధేశించాలని త్యాగరాజన్ మోదీ సర్కార్ను నిలదీశారు. ఉచితాలపై మీరు చెబుతున్నదానికి రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక ఉండాలి లేదా మాకంటే మీరు మెరుగ్గా నైపుఫ్యం సాధించి ఉండాలని హితవు పలికారు. మీకు సరైన సామర్ధ్య ట్రాక్ రికార్డు ఉందా అని ప్రశ్నించారు.
మీరు ఆర్ధిక వ్యవస్ధను వృద్ధిలోకి తీసుకువచ్చి, ఉద్యోగాలను సృష్టించి, రుణభారం తగ్గించి ఉంటే మీరు చెప్పింది తాము వినేవారమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కంటే తాము అన్ని రంగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచామని త్యాగరాజన్ చెప్పుకొచ్చారు. మీ దృక్కోణాన్ని తాము ఎందుకు అనుసరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర ఖజానాకు రాష్ట్రాల నుంచి భారీగా నిధులు సమకూరుతున్నాయని అన్నారు. అంతకన్నా మా నుంచి మీరు ఏం ఆశిస్తారని అడిగారు. మీ కోసం ఏ ప్రాతిపదికన తాము తమ విధానాలను మార్చుకోవాలని కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఉచితాలపై ఇటీవల దేశవ్యాప్తంగా హాట్డిబేట్ సాగుతున్న క్రమంలో కేంద్రాన్ని తమిళనాడు ఆర్ధిక మంత్రి తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సంక్షేమ పధకాలు ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు అవసరమని వీటిని తాయిలాలుగా పేర్కొనడం తగదని పలు విపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. విద్య, వైద్యం తాయిలాలు కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇక సంక్షేమ పధకాలను ఉచితాలుగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ సారధ్యంలోని మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.