చెన్నై : కరోనాతో అల్లాడుతున్న కేరళను నిపా వైరస్ వణికిస్తున్నది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృతి చెందగా.. 20 మందిని హై రిస్క్ కాంటాక్టులుగా గుర్తించగా.. ఇందులో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో నిపా లక్షణాలు గుర్తించారు. ఈ వైరస్ ప్రస్తుతం తమిళనాడుకు సైతం పాకింది. కోయంబత్తూరు జిల్లాలో తొలి నిపా కేసు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ జీఎస్ సమీరణ్ తెలిపారు. కాంటాక్టులను గుర్తిస్తున్నామని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధిక జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారందరికీ పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వాలాయార్ చెక్పోస్ట్ వద్ద నిపా వైరస్ పర్యవేక్షణ శిబిరాన్ని సందర్శించారు. కేరళ నుంచి తమిళనాడుకు వచ్చే ప్రజలకు కొవిడ్ ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. కొవిడ్ థర్డ్ వేవ్పై ఆయన స్పందిస్తూ.. ఏ వైరస్కు భయపడాల్సిన అవసరం లేదు.. ఎవరికైనా ఏవైనా లక్షణాలుంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కల్పిస్తున్నామని, కొవిడ్ థర్డ్ వేవ్ను అడ్డుకుంటామన్నారు.