అన్నమయ్య జిల్లా : తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిపేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
యాత్రికుల వల్ల గానీ, ఆలయ సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏటా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 17 బుధవారం సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి పవిత్ర పూజ నిర్వహిస్తారు. ఆగస్టు 18న యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, లఘు పూర్ణాహుతి చేపడతారు. ఆగస్టు 19న పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.