Taliban |దురాక్రమణ కాంక్ష నిలువెల్లా పాకిపోయిన వారికి ఎక్కడో ఓ చోట ఆశాభంగం తారసపడుతుంది. కేవలం నాలుగు వారాల్లోనే సమస్త అఫ్గానిస్థాన్ను గుప్పిట్లోకి తీసుకున్న తాలిబన్లు దీనికి అతీతులు కారు. యావత్ అఫ్గాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు.. అదే దేశంలోని ఓ ప్రాంతం కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని.. అక్కడి ప్రజలను తమ కాళ్ల కింద తొక్కిపెట్టాలని పాతికేండ్లుగా చేస్తున్న వారి కుట్రలు నేటికీ సాగడం లేదు. తాలిబన్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ ప్రాంతమే ‘ఐదు సింహాల’గడ్డగా పిలిచే పంజ్షిర్ ( panjshir ).
కాబూల్కు ఈశాన్యంగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నదే పంజ్షిర్ ప్రావిన్స్. జనాభా 1.73 లక్షలు. 400 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలోని ప్రజలు ఎన్నడూ ఒకరి కింద బానిసలుగా లేరు. ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకూ విదేశీయులు, ఉగ్రవాదులు ఎవ్వరూ ఆక్రమించలేదు. తాజాగా అఫ్గాన్లోని 34 ప్రావిన్సుల్లో 33 ప్రావిన్సుల్లో పాగా వేసిన తాలిబన్లు.. పంజ్షిర్లోకి చొరబడలేకపోయారు.
పంజ్షిర్ను పర్షియాలో ‘ఐదు సింహాల’గడ్డగా పిలుస్తారు. పేరుకు తగ్గట్టే ఇక్కడి ప్రజలకు ఆత్మగౌరవం, తెగువ ఎక్కువ. దీంతో ఎన్నో ఉద్యమాలకు ‘పంజ్షిర్’ వేదికగా నిలిచింది. అయితే, ఉద్యమ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో యాంటీ-తాలిబన్ నాయకుడు అహ్మద్ షా మస్సౌద్ కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. 1970-80లో సోవియట్ రష్యా దండయాత్రను తిప్పికొట్టేందుకు ఆయన కొంత మంది యువకులతో గెరిల్లా సేనను తయారుచేశారు. యుద్ధ సమయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఆధునిక ఆయుధాల వాడకంలో తర్ఫీదునిచ్చారు. దీంతో ఆ సేనలు సోవియట్ దళాల్ని ‘పంజ్షిర్’లోకి అడుగుపెట్టకుండా తిప్పికొట్టగలిగాయి. కాలక్రమేణా నార్తర్న్ అలయన్స్ (ఉత్తర కూటమి)గా ఏర్పడిన ఆ సేనలు 1996-2001 మధ్య తాలిబన్ల నుంచి పంజ్షిర్ను రక్షించాయి. దీంట్లో ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండలు ‘పంజ్షిర్’కు రక్షణగా నిలిచాయి. కాగా 2001లో ఆల్ఖైదా ఉగ్రవాదుల చేతుల్లో మస్సౌద్ మరణించారు. అయినప్పటికీ నార్తర్న్ అలయన్స్ క్రియాశీలంగానే ఉన్నది. తాజాగా పంజ్షిర్లోకి తాలిబన్లు చొరబడకుండా ఆ ప్రజలు, నార్తర్న్ అలయన్స్ సేన లు తుపాకులతో సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు.
రాజకీయ వ్యూహాలకు, కీలక నేతలకు ఆశ్రయమిచ్చే ప్రాంతంగా ప్రస్తుతం పంజ్షిర్ మారింది. తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పరారవ్వగా, ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ ప్రకటించుకున్నారు. అయన ఈ కీలక ప్రకటన చేసింది ‘పంజ్షిర్’ నుంచే. అహ్మద్ షా మస్సౌద్ కుమారుడు, నార్తర్న్ అలయన్స్లో కీలక పాత్ర పోషిస్తున్న అహ్మద్ మస్సౌద్ (జూనియర్)తో కలిసి తాలిబన్లకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన వ్యూహాలపై అమ్రుల్లా చర్చలు జరుపుతున్నారు. కాగా, తాలిబన్లను ఎదుర్కొనేందుకు నార్తర్న్ అలయన్స్తో కలిసి పనిచేస్తామని అఫ్గాన్ సేనలు, ప్రజలు ముందుకొస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Afghanistan: నిరసనకారులపై తాలిబన్ల కాల్పులు.. పలువురు మృతి
తాలిబన్లు వస్తున్నారు, సహాయం చెయ్యండి.. ఆఫ్ఘన్ మహిళల ఆక్రందన
Afghanistan: తాలిబన్లు, పాకిస్థాన్కు అంత సీన్ లేదు: మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా
Afghanistan: ఆ విమానంలో నుంచి కింద పడింది ఈ అన్నదమ్ములే.. ఇదీ వాళ్ల విషాద గాథ