ముజఫర్నగర్, డిసెంబర్ 7: ప్రాక్టికల్ పరీక్షల కోసమని విద్యార్థినులను మరో పాఠశాలకు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు ఓ పాఠశాల సిబ్బంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా పుర్కాజి పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడైన పాఠశాల మేనేజర్ యోగేష్ చౌహాన్ను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడు అర్జున్ కోసం గాలిస్తున్నట్టు ఎస్పీ(సిటీ) అర్పిత్ విజయ్వర్గయ్ మంగళవారం వెల్లడించారు. వారిద్దరిపై ఐపీసీ 328, 354 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్ష కోసమని నిందితులు 17 మంది విద్యార్థులను మరో పాఠశాలకు తీసుకెళ్లారని, ఆ రాత్రికి వారు అక్కడే ఉండాల్సి వచ్చిందని ఎస్పీ చెప్పారు. మత్తు మంది కలిపిన నీటిని తాగించి ఇద్దరు బాలికలపై నిందితులు లైంగిక దాడికి యత్నించారని, విషయం బయటకు చెప్పొద్దని వారిని బెదిరించారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.