గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వెనుతిరగ్గా.. ఎవరూ ఊహించని విధంగా ఆస్ట్రేలియా టైటిల్ నెగ్గింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్లో కూడా కంగారూ జట్టు హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగనుంది. ఇదే విషయాన్ని ఆసీస్ మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు రికీ పాంటింగ్ స్పందించాడు.
అంతేకాదు, ఈసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడతాయని అంచనా వేశాడు. అలాగే హోం కండిషన్స్, మిగతా అంశాల ఆధారంగా ఫైనల్లో భారత్పై ఆసీస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు. ఈ రెండు జట్లే ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని, వీటితోపాటు ఇంగ్లండ్ కూడా గట్టిపోటీ ఇస్తోందని వివరించాడు. ఐసీసీ నిర్వహించిన ఒక రివ్యూ కార్యక్రమంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరి ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ను ఎవరు ముద్దాడుతారో చూడాలి.