తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి రూ.400 కోట్ల నిధులను టీ-హబ్ నిర్మాణానికి కేటాయించిందని ఐటీ పరిశ్రమలశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ తెలిపారు. 45 దేశాలకు చెందిన ట్రేడ్ ఆఫీస్, వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఇన్నోవేటివ్ ఎకోసిస్టం తదితర సదుపాయాలు టీ-హబ్ కలిగి ఉన్నదని చెప్పారు. ఎనిమిదేండ్ల క్రితం హైదరాబాద్ను ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చాలన్న కల నెరవేరిందని తెలిపారు. మంత్రి కేటీఆర్ అన్ని బాధ్యతలు తీసుకొని టీ-హబ్ ఏర్పాటును విజయవంతం చేశారని ప్రశింసించారు. సుమారు 4 వేల స్టార్టప్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించే సామర్థ్యం టీ-హబ్ 2కు ఉన్నదని వివరించారు. సమాజంలో ప్రజల అవసరాలు, సమస్యలను గుర్తించి టెక్నాలజీని జోడించి పరిష్కారం చూపేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువకులకు టీ-హబ్ అండగా నిలుస్తుందని తెలిపారు.
ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో టీ హబ్ 2.0 కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే టీ-హబ్ ద్వారా వందల మంది స్టార్టప్ కంపెనీలు స్థాపించుకోగలిగారని వెల్లడించారు. స్టార్టప్ ఇండియా మిషన్ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సహకారంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ సెంటర్ కూడా టీ-హబ్లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. టీ-హబ్ ఇప్పటివరకు 1100 స్టార్టప్లకు ఇంక్యుబేట్ చేయడంలో సహాయపడిందని, అవి సుమారు పది వేల కోట్లను సమీకరించాయని తెలిపారు. టీ-హబ్ సీఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ టీ-హబ్ 2 భవనంలో ఒక అంతస్తు మొత్తాన్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్ కోసమే కేటాయించామని చెప్పారు.