సిటీబ్యూరో, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో ఆకలి అని కేకలేస్తే క్షణాల్లో ఆహార పదార్ధాలను అందించే స్విగ్గీ బాయ్స్ తమ సమస్యలను చేబూని సమ్మె బాట పట్టారు. పెరిగిన పెట్రోలు ధరలకు అనుగుణంగా తమ అలవెన్సులు కూడా పెంచాలనే డిమాండ్తో గ్రేటర్లోని స్విగ్గీ డెలివరీ బాయ్స్ నవంబర్ 29 నుంచి నిరవధిక నిరసనను ప్రారంభించారు. నిత్యావసర ధరలతో పాటు ఇంధన రేట్లు పెరగడంతో ఆహార సంస్థలు ఒక్కో బుకింగ్పై 25 శాతం పెంచారు. పెరిగిన ధరల ప్రకారం, తమకు న్యాయం చేయాలని మంగళవారం రెండో రోజు స్విగ్గీ డెలివరీ బాయ్స్ నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు.
కస్టమర్కు తప్పని ధరల తిప్పలు..
డెలివరీ బాయ్స్ మాత్రమే కాదు ఆన్లైన్ ఫుడ్ డెలివరీతో వినియోగదారులపై భారం పడుతున్నది. ఉదాహరణకు గతంలో వినియోగదారుడు నేరుగా రెస్టారెంట్కు వెళితే రూ.100లకు బిర్యానీ లభించింది. కాని, ఆన్లైన్లో మాత్రం రూ.140కి వస్తుంది. అంటే, రూ.40లు వినియోగదారుడి నుంచి వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్రతి రూ.100కు స్విగ్గీ యాజమాన్యం రూ.30 చొప్పున రెస్టారెంట్ల నుంచి వసూలు చేస్తున్నది. అట్లాగే, ఒక్కో డెలివరీపై ఆహార ప్రియుల నుంచి జీఎస్టీతో కలిపి రూ.50లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మాకు ఒక్కో డెలివరీకి రూ.20లు మాత్రమే ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన రూ.35లను పునరుద్ధరించాలంటున్నాం తప్ప ఎక్కువ పెంచమనడం లేదన్నారు.
ఆర్డర్ చొప్పునే ఆదాయం వచ్చేది: కిశోర్ బాబు
‘గతంలో ఒక బుకింగ్ ఆర్డర్పై రూ.35లు వచ్చేవి. అందులో రూ.300 ఇన్సెంటీవ్స్ ఇచ్చేవారు. అయితే కొవిడ్-19 ప్రభావంతో ఒక బుకింగ్ ఆర్డర్పై కమిషన్ను రూ.35 నుంచి రూ. 15కు తగ్గించారు. కొన్నాళ్ల తర్వాత పెట్రోలు ధరలు పెరగడంతో ప్రస్తుతం రూ.20లు ఇస్తున్నారు. మునుపటిలాగే రూ.35లు ఒక ఆర్డర్పై ఇవ్వాలనే న్యాయమైన డిమాండ్తో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. గతంలో ఒక్క రోజులో రూ.14 వందలు సంపాదించేవాళ్లం. ప్రస్తుతం ప్రతిరోజు రూ.300ల పెట్రోలు ఖర్చవుతున్నది. రోజుకు రూ.800 మాత్రమే సంపాదిస్తున్నాం. ప్రస్తుతం రూ.600ల తక్కువకు పనిచేయాల్సి వస్తుంది’ అని కిషోర్ బాబు అనే డెలివరీ బాయ్ తెలిపారు.
సామాజిక భద్రత కల్పించాలి: షేక్ సలావుద్దీన్
గ్రేటర్లో స్విగ్గీ డెలివరీ బాయ్స్ మొత్తం 46 వేల మంది ఉన్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫార్మ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. రెండో రోజు హబ్సిగూడ, ఏఎస్ రావునగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలిలోని ఇంద్రానగర్, మాదాపూర్ ప్రాంతాల్లో నిరసన చేపట్టామని చెప్పారు. అన్ని ఆహార సంస్థల్లో పనిచేస్తున్న ఫుడ్ డెలివరీ బాయ్స్కు సేవలకు తగిన అలవెన్సులు అందజేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించేందుకు పార్లమెంటరీ కమిటీ వేసినా ఇప్పటికీ గైడ్లైన్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.