హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): న్యాయవాదుల కోటాలో హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులుగా నియమితులైన ఆరుగురు మంగళవారం ప్రమాణం చేయనున్నారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఉదయం 10.45 గంటలకు వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేయించనున్నారు. వీరిలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేశ్, పుల్లా కార్తీక్, కాజా శరత్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. మరో ఇద్దరు జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం వీరు సీనియర్ న్యాయమూర్తులతో కలిసి ద్విసభ్య ధర్మాసనాల్లో కూర్చొని, కేసులను విచారించనున్నారు.