కొండలు, వరిపొలాలతో అందంగా కనిపించే ఆ కుగ్రామం వెనుక బ్రిటిషర్లకు ఎదురుతిరిగిన పోరాట చరిత్ర ఉన్నది. అధిక పన్నులను వ్యతిరేకిస్తూ సొంత సర్కారు ఏర్పాటు చేసుకున్న సాహసోపేత గ్రామమది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఇస్సూరు ఆలయం వద్ద కనిపించే నల్లని శిలాఫలకం బ్రిటిషర్లు చేసిన నెత్తుటి గాయాలు, గ్రామస్థుల వీరోచిత పోరును గుర్తుచేస్తున్నది.
దేశంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అదే సమయంలో ఇస్సూరు ఒకడుగు ముందుకు వేసింది. ఇక పన్నులు చెల్లించకూడదని గ్రామసభలో నిర్ణయించారు. బ్రిటిష్వారిని తోసిరాజని సొంత పాలన ఏర్పాటు చేసుకున్నారు. గాంధీ టోపీలు ధరించిన యువకులు వీరభద్రేశ్వరాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వాధికారులు తమ గ్రామంలోకి రావొద్దని హెచ్చరిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో తాసిల్దార్గా జయన్న (16), సబ్ ఇన్స్పెక్టర్గా మాలపయ్య (16)ను నియమించారు. సాహుకార్ బసవేనప్ప నాయకత్వంలో ఈ నియామకం జరిగింది. మైనర్లకు జైలు శిక్ష ఉండదనే ఉద్దేశంతో వీరిని నియమించాడు. అనంతరం తన తోటి సహచరులతో కలిసి బసవేనప్ప స్వయం పాలన నియమాలు రూపొందించాడు. పన్నులు వసూలు చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను ఇంగ్లిష్ డాగ్స్ అంటూ అవమానించేవారు. వారి చేతుల్లోని ముఖ్య పత్రాలను లాగేసుకుని, చించేసే స్థాయికి వెళ్లారు.
పోలీసులు వచ్చి బెదిరింపుగా గాలిలోకి కాల్పు లు జరిపారు. 4 రోజుల తర్వాత సైన్యాన్ని దింపారు. ఈ సైన్యం రాగానే ఊరంతా లూటీ చేసింది. గ్రామస్థుల మీద దౌర్జన్యాలకు పాల్పడింది. దీంతో గ్రామస్థులు తిరగబడ్డారు. సైన్యంపై దాడి చేసి ఇద్దరు బ్రిటిష్ అధికారులను చంపేశారు. సైన్యం దాడి తీవ్రతరం చేసింది. గ్రామస్థుల్లో కొంతమంది పారిపోయి దగ్గర్లోని అడవుల్లో దాక్కోగా.. పోలీసులు కొం తమందిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. వీరిలో ఐదుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ముగ్గురు మహిళలకు జీవితకాల శిక్ష పడింది. మైసూరు మహారాజు జయచామరాజ వడయార్ రంగంలోకి దిగి.. బ్రిటిష్ అధికారుల తో మాట్లాడి కొంతమందికి శిక్ష తగ్గించేలా చేశారు.