న్యూఢిల్లీ: స్వదేశీ అంటే విదేశాలకు సంబంధించిన ప్రతీది వదులుకోవాలని అర్థం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగాలని అయితే ఆ వాణిజ్యం మన దేశ ప్రయోజనాలను దెబ్బతీయకుండా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం మనం స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. స్వావలంబన ఉపాధి సృష్టి జరుగుతుందన్నారు.
స్వావలంబన సాధించకపోతే మన ఉద్యోగాలు ఊడిపోతాయని, దాంతో దేశంలో హింసకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. కాబట్టి స్వదేశీ అంటే స్వావంబన, అహింస అని అర్థమని ఆయన చెప్పారు. మనం ఇంటర్నెట్ను, టెక్నాలజీని వాడుతున్నామని, కానీ మనదగ్గర వాటికి సంబంధించిన అసలు టెక్నాలజీ లేదని పేర్కొన్నారు. అందుకోసం మనం బయటి దేశాలపై ఆధారపడుతున్నామని చెప్పారు.
మనం చైనా గురించి మాట్లాడుకుంటాం, చైనా వస్తువులను బహిష్కరించాలంటాం.. కానీ మీ మొబైల్ ఫోన్లలో వాడే ప్రతీది ఎక్కడి నుంచి వస్తుంది..? అన్నింటికి చైనా పైనే ఆధారపడుతున్నాం. ఇలా ప్రతి దానికి చైనాపై ఆధారపడటం అనేది పెరిగిపోతే భవిష్యత్తులో మనం వారి ముందు మోకరిల్లాల్సి వస్తుంది అని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. పరిస్థితి అందుకు భిన్నంగా ఉండాలంటే మనం అన్నింటా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు.