జాతీయ స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ – 2022 పోటీల్లో మన పట్టణాలు మెరిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు సత్తా చాటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ, జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మున్సిపాలిటీలు ఉత్తమ ర్యాంకులు సాధించాయి. దేశ వ్యాప్తంగా 4355 మున్సిపాలిటీలు పాల్గొన్న ఈ పోటీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్లు, సిటిజన్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్పై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి వాటిలో ఈ నాలుగు మున్సిపాలిటీలు అవార్డుకు ఎంపికయ్యాయి.
కొత్తపల్లి, సెప్టెంబర్ 24: స్వచ్ఛ సర్వేక్షణ్-2022 పోటీల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని పట్టణాలు సత్తా చాటాయి. పారిశుధ్య నిర్వహణ, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంపై దేశ వ్యాప్తంగా 4355 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించారు. ఇందులో సౌత్ జోన్ విభాగంలో లక్ష లోపు జనాభా కలిగిన రాష్ట్రంలోని 15 మున్సిపాలిటీలు, ఒక కంటోన్మెంట్ బోర్డు పురస్కారానికి ఎంపికయ్యాయి. వీటిని ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికన తీసుకున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్లు, సిటిజన్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి విషయాల్లో కనబర్చిన ప్రతిభను ఆధారంగా ఈ అవార్డులకు ఎంపిక చేశారు. కాగా, అక్టోబర్ 1న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా వీటిని మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్లు, కమిషనర్లు అవార్డులను అందుకోనున్నారు.
సిరిసిల్ల సిగలో మరో పురస్కారం
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన సిరిసిల్ల మున్సిపాలిటీ సిగలో మరో స్వచ్ఛ పురస్కారం చేరింది. స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్)లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ర్యాంకింగ్లో సత్తా చాటింది. ఉత్తమ పనితీరు కనబరిచి అవార్డుకు ఎంపికవడంపై పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
మెరిసిన కోరుట్ల
స్వచ్ఛ సర్వేక్షణ్ -2022లో కోరుట్ల మెరిసింది. పట్టణంలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం (ఫిజికల్ స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) ఏర్పాటు చేసి మల వ్యర్థాల ద్వారా ఎరువులను తయారు చేసి మొక్కలకు ఉపయోగించడం, నిత్యం 33 వార్డుల్లో ప్రత్యేక వాహనాల ద్వారా తడి, చెడి చెత్త వేర్వేరుగా సేకరించి ప్లాస్టిక్, గాజు సీసాలు, కాగితం వేరు చేసి మున్సిపల్ అధ్వర్యంలో నెలకొల్పిన పొడి వనరుల కేంద్రానికి తరలించడం, వాటిని అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం కార్మికులకు అందించడం, పట్టణ, పరిసర గ్రామాల ప్రజల సౌకర్యం కోసం 8 రద్దీ ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, పచ్చదనానికి ప్రాధాన్యం కల్పించడంలో విరివిగా మొక్కలు నాటడం, ప్రజలకు పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో సత్ఫలితాలు సాధించడం ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణతో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకుకు ఎంపికైంది. కాగా, అవార్డు రావడంపై మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ సంతోషం వ్యక్తం చేశారు. అవార్డు దక్కడానికి కృషి చేసిన స్వచ్ఛ సర్వేక్షన్ కోరుట్ల బ్రాండ్ అంబాసిడర్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ఉపాధ్యక్షుడు, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి కేటీఆర్ సహకారంతోనే..
మంత్రి కేటీఆర్ మార్గదర్శనం, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు పాలకవర్గాలు, ప్రజలు, అధికారులందరి సహకారంతోనే ఈ అవార్డుకు సిరిసిల్ల, వేములవాడ ఎంపికయ్యాయి. పట్టణాలను మెరుగు పర్చడంలో అందరి సమన్వయం ఉన్నది. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ మంత్రి సూచనలతో రెండు పట్టణాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
– రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్జయంతి
బాధ్యత మరింత పెరిగింది
మంత్రి కేటీఆర్ ఆశయానికి అనుగుణంగా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్లనే స్వచ్ఛ సర్వేక్షన్-2022 అవార్డుకు ఎంపికయ్యాం. ప్రతీసారి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో సిరిసిల్ల మున్సిపాలిటీ సత్తా చాటుతూ వస్తున్నది. మున్సిపల్ సూచించిన నిబంధనలను ప్రజలందరూ పాటిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో పని చేస్తున్నారు. అవార్డు ఎంపికతో మాపై బాధ్యత మరింత పెరిగింది.
– మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ
ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం
స్వచ్ఛ సర్వేక్షన్లో వేములవాడ పురపాలకసంఘం ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు సహకారంతో అవార్డును దక్కించుకున్నాం. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత అంకితభావంతో పనిచేసి మెప్పు పొందుతాం.
– రామతీర్థపు మాధవి, మున్సిపల్ చైర్పర్సన్ (వేములవాడ)
స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యత ఇస్తాం
స్వచ్ఛ సర్వేక్షన్లో అవార్డు రావడం సంతోషంగా ఉంది. కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది ప్రజల సహకారంతో అవార్డును దక్కించుకున్నాం. కలెక్టర్ అనురాగ్జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ప్రోత్సాహం కూడా ఉన్నది. స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యతను ఇచ్చి మెప్పు పొందే విధంగా పనిచేస్తాం.
– శ్యామ్సుందర్రావు, మున్సిపల్ కమిషనర్ (వేములవాడ)