గాంధేయవాదం 75 ఏళ్ల స్వతంత్ర భారతపు ఆటుపోట్లను తట్టుకొని నిలిచింది. సుదీర్ఘకాలంగా ఈ గడ్డ సమైక్యత కోసం తపించింది. ఆ సమైక్యతను సాధించి చూపినవాడు గాంధీజీ. ఆ స్ఫూర్తితోనే భారత్ మునుముందుకు సాగాల్సి ఉంది. మనల్ని చీలికలు పేలికలుగా విడదీసే సిద్ధాంతాలు అనాదిగా ఉన్నాయి.ఇవాళ మనమంతా కుడిఎడమలుగా ఎలా చీలిపోయి ఉన్నామనే దానికన్నా మనల్ని కలిపేది, నిలిపేది ఏమిటనేది చాలా ముఖ్యం.
ఈ వారాంతంలో మనం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాం. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఆ రోజే భారత స్వాతంత్య్ర పతాకాన్ని ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ తొలిసారిగా ఎగురవేశారు. పార్లమెంటులో ‘విధితో భారతదేశం చాలాచాలా కాలం క్రితం ఒక ఒడంబడిక చేసుకున్నదని’ మొదలయ్యే చరిత్రాత్మకమైన, ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ‘ప్రతి ఒక్కరి కన్నీరు తుడవడమే మన ముందున్న మహత్తరమైన కర్తవ్యమని మన తరానికి చెందిన మహానుభావులు భావించారని” ఆ ప్రసంగంలో ఆయన చెప్పారు. నెహ్రూ తన ప్రసంగంలో ప్రస్తావించిన ఆ మహోన్నత మానవుల్లో బాపూజీ ఉండి తీరుతారు.
పరిపూర్ణ భారతీయ విలువలతో కూడిన ఈ సిద్ధాంతంతో మనమంతా ఏకీభవించకుండా ఉండలేం. జాతిపిత గాంధీని మనం ప్రేమగా బాపూ అని పిలుచుకుంటాం. దరిద్ర నారాయణుల సేవ చేసుకోవడమే రాజకీయాలకు పరమోన్నత లక్ష్యంగా ఉండాలని ఆయన పదేపదే ఉద్బోధించారు. కులమతాలకు అతీతంగా అందరికీ అభివద్ధి, సంక్షేమం అందించాలని చెప్పారు.
‘సర్వ జనుల కన్నీళ్లు తుడవడం అనే లక్ష్యం పూర్తిగా నెరవేర్చడం మన శక్తియుక్తుల పరిధిలో లేకపోవచ్చు. కానీ కన్నీళ్లు, బాధలు ఉన్నంత వరకు మన కర్తవ్యం పూర్తయినట్టుగా భావించలేమని’ నెహ్రూ నొక్కిచెప్పారు. మహాత్ముని కారుణ్యభరిత సందేశం తరాలు మారినా ఇంకా మనచెవుల్లో గింగురుమంటూనే ఉంది. ప్రజాస్వామ్యం సగౌరవంగా, సమున్నతంగా నిలిపిన ఇలాంటి సమైక్యవాద విలువలే దశాబ్దాలుగా అధికారం కోసం జరిగే మల్లగుల్లాల మధ్య మనల్ని స్థిరంగా అడుగు తడబడకుండా ముందుకు నడిపిస్తున్నాయి.
స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొనాలి..
‘శాంతి, స్వేచ్ఛ అనేవి ఒకదాని నుంచి మరొకటి విడదీయరానివి. ఇప్పుడైతే సంపద కూడా వచ్చిచేరింది. ఈ ఏకైక ప్రపంచాన్ని ముక్కలు కాకుండా చూడడం అనేది కూడా విడదీయరాని అంశమే. అలా విడగొడితే అది ఉత్పాతమే అవుతుంది’ అని నెహ్రూ హెచ్చరించారు. ఇందులో కొంత ఠాగూరు ప్రతిధ్వని ఉన్నప్పటికీ మనం మాత్రం బాపూజీ లక్ష్యానికే మౌలికంగా నిబద్ధులమై ఉందాం. వీలైనంత గర్వంగా, సాహసికతతో, విజ్ఞతతో..
అప్పుడప్పుడూ జరిగే సైనిక యుద్ధాల్లో మాత్రమే క్రూరత్వాన్ని మాత్రమే చూసి… మన సామాజిక వ్యవస్థలోని నిరంతరంగా క్రౌర్యాలను చూడలేనివారి శాంతిప్రియత్వం నిరర్థకమైంది.
పేదరికం అత్యంత హేయమైన హింస కిందకు వస్తుంది. నిస్సహాయుల పట్ల ఎలా వ్యవహరిస్తుందనే దాన్ని బట్టే ఒక దేశం గొప్పతనం అంచనా వేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఆకలిగొన్నవాళ్లు చాలామందే ఉన్నారు. వారికి దేవుడు అన్నం రూపంలో తప్ప మరోలా కనిపించడు.