1947, ఆగస్టు 14 అర్ధరాత్రి నెహ్రూ ప్రసంగం సంక్షిప్తంగా..
చాలా ఏళ్లక్రితమే మనం విధితో ఓ ఒప్పందం చేసుకున్నాం. అప్పుడు మనం చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చాల్సిన సమయం వచ్చేసింది. అది పరిపూర్ణంగా జరగాలి. అర్ధరాత్రి ప్రపంచం నిద్రపోతుంటే భారతదేశం స్వేచ్ఛలోకి, జీవనంలోకి మేల్కొన్నది.. చరిత్రలో ఏ దేశానికైనా ఇలాంటి సందర్భం చాలా అరుదుగా వస్తుంటుంది.
విమర్శలు
భారత ప్రజలంతా మాపై విశ్వాసం ఉంచండి.. నమ్మకం ఉంచడి.. మాతో చేయి కలపండి.ఇది కుంగదీసే విమర్శలకు సమయంకాదు. ఇతరులను నిందించేందుకు సం దర్భం కాదు. అందరం బాగుండాలి. భావి భారత పౌరులందరూ గొప్పగా నివసించేందుకు స్వేచ్ఛా భారత్ను నిర్మించుకోవాలి.
కొత్త నక్షత్రం జన్మించింది..
తూర్పున కొత్త నక్షత్రం ఉదయించింది. కొత్త ఆశలు చిగురించాయి. ఎప్పటినుంచో మనం కోరుకున్నది ఇప్పుడు నిజమైంది. ఇక ఈ నక్షత్రం ఎప్పటికీ అస్తమించదు.. మోసపోదు. ఎన్నో మేఘాలు ఆవరించి ఉన్నాయి. భవిష్యత్తు ఏం కనిపించడం లేదు. అయినా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం.. క్రమశిక్షణ , స్వేచ్ఛ కలిగిన ప్రజలతో కలిసి సమస్యల్ని మనం అధిగమించబోతున్నాం.
జాతిపితకు కృతజ్ఞతలు తెలుపుదాం..
ఈ రోజున స్వాతంత్య్రోద్యమాన్ని నిర్మించిన ఆర్కిటెక్ట్, స్వాతంత్య్ర జ్యోతి వెలిగించి మన చుట్టూ ఉన్న చీకటిని తొలగించిన మన జాతిపతకు కృతజ్ఞతలు తెలుపుదాం. బాపూజీ మనల్ని అహింసామార్గంలో నడిపించిన తీరు భావితరాలపై చెరగని ముద్రను వేస్తుంది. ఆయన వెలిగించిన స్వాతంత్య్ర జ్యోతిని ఎప్పటికీ ఆరిపోకుండా మనం చూసుకోవాలి. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది సైనికులు, వలంటీర్లు అమరులయ్యారు. వారందరినీ స్మరించుకోవాలి.
అడ్డంకులు..
మనముందు చాలా కఠినమైన పరిస్థితులున్నాయి. మనం చేసుకున్న ప్రతిజ్ఞలన్నింటినీ నెరవేర్చుకునేదాకా మనం విశ్రమించకూడదు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ లభించేదాకా మనం కష్టపడాల్సిందే. మనమందరం భారతీయులం. ఒక అద్భుతమైన సమయంలో ఉన్నాం. భారతదేశంలో ఏ మతలో జన్మించిన పిల్లలకైనా సమాన హక్కులుండాలి. అలాగే, బాధ్యతలు కూడా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్వాన్ని, సంకుచితత్వాన్ని ప్రోత్సహించకూడదు. ప్రపంచంలో ఏ దేశం కూడా సంకుచిత భావాలతో అభివృద్ధి చెందలేదు.
ముగింపు..
శాంతి, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలను ముందుకు తీసుకుపోవడంలో సహకరిస్తామని ప్రపంచ దేశాలకు, ప్రజలందరికీ మాటిస్తున్నాం. ప్రాచీనమైన, శాశ్వతమైన, నిత్యనూతనత్వంతో కూడిన భారత మాతభూమికి సగౌరవ వందనం చేస్తూ సేవకు మరోమారు పునరంకితమవుతున్నాం.
ప్రతిజ్ఞ..
భవిష్యత్తు మనల్ని పిలుస్తున్నది. దేశంలోని కర్షకుడు, శ్రామికుడు..
ఇలా అన్ని వర్గాలకు స్వేచ్ఛా స్వతంత్రాలు రావాలి. పేదరిక నిర్మూలన జరుగాలి. అసమానతలను రూపుమాపాలి. రోగాలను నివారించాలి. మనది ధనికమైన, ప్రజాస్వామ్యయుత, ప్రగతిశీల దేశంగా ఉండాలి. సాంఘిక, రాజకీయ, ఆర్థిక సంస్థలను నెలకొల్పి దేశంలోని ప్రతి పౌరుడికి సమన్యాయం, ఫలప్రదమైన జీవితం అందేలా చూడాలి.