1883.. ప్రజల్లో ఓ కదలిక. స్వాతంత్య్రోద్యమ చరిత్ర పుటల్లో నిలిచిన మహత్తర ఘటన. చాందా రైల్వే పథకం సరైంది కాదంటూ అసాధారణమైన రీతిలో ప్రజలు గొంతు విప్పిన సంవత్సరం. మొట్టమొదటిసారిగా ఓ రాజ్య సమస్యపై ప్రజలను శాంతియుతంగా సమీకరించి నిరసన కార్యక్రమం నడిపిన రోజులవి.
సికింద్రాబాద్ నుంచి వాడీ వరకు గల స్టేట్ రైల్వేను బ్రిటిష్ కంపెనీకి అప్పగించి విస్తరింపజేయాలనేది కొత్తగా ఏర్పాటైన రాజమండలి ఆలోచన. వరంగల్కు, అటునుంచి భద్రాచలం లేదా బెజవాడకు, మరోవైపు మహారాష్ర్టలోని చాందా వరకు రైల్వేలైను పొడిగించాలనుకున్నారు. సాలార్జంగ్ కాలంలోనే దీనికి ఆమోదం లభించినప్పటికీ ఆయన హయాం ముగిసిన తర్వాత రాజమండలి కింద పరిపాలన సాగుతున్న సమయంలో దీని అమలు చేపట్టారు.
అప్పటికే హైదారాబాద్లో విద్యాధిక వర్గం రూపొందింది. ఈ వర్గం ప్రజా వ్యవహరాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టింది. చాందా రైల్వే పథకం వల్ల సంస్థానానికి ఆర్థిక నష్టం కలుగుతుందని భావించిన కొందరు పెద్దలు ఓ కమిటీ వేశారు. డాక్టర్ అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూవ్ు దీనికి నాయకులు. చాందా పథకానికి సంబంధించిన మొత్తం అన్ని వివరాలు ప్రజల ముందుంచాలని ఈ కమిటీ రాజమండలి ముందు డిమాండ్ పెట్టింది. హైదరాబాద్ చరిత్రలో ఇలా పౌర సమాజం ఓ డిమాండ్ పెట్టడం అనేది అప్పటికి అనూహ్యమైన విషయం. పైగా వైస్రాయికి మెమొరాండం పంపాలని నాయకత్వం తలపెట్టింది.
అఘోరనాథ్కు రాజ్య బహిష్కరణ..
ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. హైదారాబాద్ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న అఘోరనాథ్ ఛటోపాధ్యాయను సర్వీసు నుంచి తొలగించి, రాజ్య బహిష్కరణ శిక్ష విధించింది. దస్తూర్ ఔసాజీ హోషంగ్ అనే రెవెన్యు అధికారిని కూడా ఈ ఆందోళన కారణంగానే రాజ్య బహిష్కారం చేశారు. వీరందరూ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని కూడా అరోపణలు వచ్చాయి.
ఒక శాంతియుత ఆందోళనకు అల్లర్ల ముద్ర వేసి, అణచివేశారు. పోలీసులు అఘోరనాథ్ ఛటోపాధ్యాయను బలవంతంగా రైల్వేస్టేషన్కు తీసుకువెళ్లి రైలెక్కించారు. 11 మంది పోలీస్ ఎస్కార్టులు ఆయనను రెండోతరగతి బోగీలో తీసుకువెళ్లి షోలాపూర్ దాకా దిగబెట్టి వచ్చారు. ఈ రాజ్య బహష్కారాలపై పత్రికల్లో కూడా వార్తా కథనాలు వచ్చాయి. మెమొరాండంపై ఎందరో సంతకాలు పెట్టినా అఘోరనాథ్, హోషంగ్లపైనే చర్యలు తీసుకున్నారు. రైల్వే పథకం యథావిధిగా అమలు జరిగింది.
1886 నాటికి సికింద్రాబాద్ నుంచి బెజవాడకు లైను వేశారు. డాక్టర్ అఘోర్నాథ్ను రెండేండ్ల తర్వాత రాజ్యంలోకి తిరిగి రానిచ్చారు. అప్పటికి హైద్రాబాద్ కళాశాల నిజాం కళాశాలగా రూపాంతరం చెందింది. ఆ కళాశాలకు ప్రిన్సిపాల్గా డాక్టర్ అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నియమితులయ్యారు. తర్వాత కాలంలో ఎన్నో సంస్ధల కార్యకాలాపాలు, ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. దస్తూర్ హోషంగ్ను కూడా రాజ్యంలోకి అనుమతించి ఆయన ఉద్యోగం ఆయనకు తిరిగిచ్చారు. చాందా ఆందోళనలో పాల్గొన్న ముల్లా అబ్దుల్ ఖయ్యూవ్ు కొంతకాలం పాటు మద్రాసులో ఉండి తిరిగి వచ్చారు. 1906లో మరణించేంత వరకు ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించారు. చాందా రైల్వే ఆందోళన తెచ్చిన కదలిక ప్రజల్లో చైతన్యవ్యాప్తికి బీజాలు వేసింది.