భారత స్వాతంత్య్ర పోరాటం మరో రూపు ఎలా ఉంటుందో బ్రిటిష్ వారికి చూపించిన ధీరుడు. శత్రువు శత్రువు మిత్రుడన్న ఎత్తుగడతో జపాన్, జర్మనీల వత్తాసుతో బ్రిటిష్ భారతం మీదకు దండెత్తి వచ్చిన వీరుడు. మాతృదాస్య విమోచనకు సమరమే మార్గమని తీర్మానించుకున్న శూరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1944లోనే స్వతంత్ర భారత్ సర్కార్ ఏర్పాటు చేసి, బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.
అజాద్ హింద్ ఫౌజ్ (స్వతంత్ర భారత సేన)ను ఏర్పాటు చేసి సైనిక పోరులోనే బ్రిటిష్ దొరలను మట్టి కరిపించేందుకు కొదమసింహంలా దూకాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ సైన్యమే రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో భారత సరిహద్దుల్లోకి దూసుకువచ్చి వలస పాలకుల గుండెల్లో బెదురు పుట్టించింది. విదేశీ గడ్డమీద పుట్టిన అచ్చమైన భారతీయ సైన్యమది.
1944 ఏప్రిల్ 14.. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఓ మైలురాయి. ఆ రోజు అజాద్ హింద్ సేనలు సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి. ఈ గడ్డపై రెండు వందల ఏండ్ల బ్రిటిష్ ఆధిపత్యానికి గండి కొట్టాయి. బర్మా భూభాగం మీదుగా భారత్లోకి నేతాజీ సైన్యం ప్రవేశించడం బ్రిటిష్ దొరలను గడగడలాడించింది. 1944 ఏప్రిల్ 13న ఐఎన్ఏ బహదూర్ గ్రూప్ దళాల కమాండర్ కల్నల్ షౌకత్ అలీ మాలిక్ నేతత్వంలో అజాద్ సేనలు మణిపూర్ను చేజిక్కించుకున్నాయి. ఆ ప్రాంతానికి రక్షణగా ఉన్న 17వ బ్రిటిష్ డివిజన్ చేతులెత్తేసి తోక ముడిచింది. ఇదొక అద్వితీయ ఘట్టం.
మొట్టమొదటిసారిగా 18,000 చదరపు మైళ్ల భారత భూభాగం ‘ఆజాద్ హింద్ సేన’ చేతుల్లోకి వచ్చింది. అప్రతిహతంగా సాగుతున్న బ్రిటిష్ ఆధిపత్యం ఆ రోజు మట్టి కరిచింది. మరుసటి రోజు సాయంత్రం అంటే 1944 ఏప్రిల్ 14న మణిపూర్లోని మొయిరంగ్లో కల్నల్ షౌకత్ అలీ విముక్త ప్రాంతంలో అజాద్ హింద్ ఫౌజ్ రూపొందించిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. ‘ప్రాచీనకాలం నుంచి మణిపూర్కు కంచుకోటలా ఉంటున్న మొయిరంగ్ను ఈ రోజు చేజిక్కించుకొన్నాం.
ఢిల్లీ వరకు ఈ జైత్రయాత్ర కొనసాగించి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడమే మా అంతిమ లక్ష్యం’ అని ప్రకటించాడు. మన సైన్యం ఇక్కడకు చేరుకొనేందుకు అనేకమంది బలిదానం చేశారు. ఢిల్లీ దారిలో ఇంకా ఎంతో రక్తతర్పణం తప్పదు. భారత్ గడ్డ నుంచి శత్రువును తరిమికొట్టాలంటే ఈ త్యాగాలు తప్పవు. భారత స్వాతంత్య్రం ఇంకెంతో దూరంలో లేదని’ ఉద్వేగభరితంగా ప్రసంగించాడు. అందరూ తలా ఒక చేయి వేస్తేనే స్వాతంత్య్ర స్వప్నం సిద్ధిస్తుందని పిలుపునిచ్చాడు. ఈ పిలుపు అందుకొని ఎందరో మణిపురీ యువకులు అజాద్ హింద్ ఫౌజ్లో చేరారు. అందులో ఒకడైన మైరంబాం కోయిరంగ్సింగ్ తర్వాతి కాలంలో మణిపూర్ తొలి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
పూర్ణ వికసిత గులాబీ పుష్ప సౌరభం నీకు కావాలా? అయితే కంతికాలను సైతం నీవు స్వీకరించాల్సిందే. మందస్మిత ఉషోదయపు మాధుర్యాన్ని వాంఛిస్తున్నావా? అయితే గాఢ నిశాంధాకారపు ఘడియల గుండా నీ జీవితం సాగాల్సిందే. స్వేచ్ఛానందాన్ని, స్వాతంత్య్ర ప్రశాంతిని అభిలషిస్తున్నావా? అయితే వాటి ఖరీదు నీవు చెల్లించాల్సిందే. బాధ, త్యాగం ఇవే స్వేచ్ఛకోసం నీవు చెల్లించాల్సిన మూల్యం. మీరు రక్తాన్నిస్తే నేను స్వాతంత్య్రాన్నిస్తా!
-నేతాజీ సుభాష్ చంద్రబోస్