మొదటి స్వాతంత్య్ర సంగ్రామం అంటే అందరికీ గుర్తుకొచ్చేది 1857. కానీ, అంతకు రెండేళ్ల ముందే బ్రిటిష్వారికి వ్యతిరేకంగా ఆదీవాసీలు వీరోచిత పోరాటం చేశారు. హక్కులు, జీవనోపాధి, మాతృభూమి కోసం బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించి చరిత్రలో నిలిచిపోయారు సంతాల్ గిరిజన బిడ్డలు.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో బలపడింది. వ్యవసాయరంగంపై దృష్టిసారించింది. సాంప్రదాయ పంటలతో లాభం ఎక్కువగా ఉండదనే కారణంతో వాణిజ్య పంటలు పండించాలని బ్రిటిషర్లు నిర్ణయించారు. వాణిజ్య పంటలకు ఎంతోమంది కూలీలు అవసరం. అయితే, ఘోర బెంగాల్ కాటకం వల్ల ఎందరో మరణించారు. దీంతో కూలీల కొరత ఏర్పడింది. ఈ కొరతను అధిగమించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్త కుట్రకు తెరలేపింది. పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాల్లో ఉన్న సంతాల్ తెగపైన కన్నేసింది.
వారంతా కష్టజీవులు. వారిని ఆకట్టుకునేందుకు 1832లో జార్ఖండ్లోని సాహెబ్గంజ్, పాకూర్, గొడ్డా జిల్లాల్లోని రాజ్మహల్ ఏటవాలు కొండల అటవీ ప్రాంతాన్ని ‘దివానీ-కి-కోహ్’గా గుర్తించి, ఆ ప్రాంతంలో శాశ్వతంగా భూములిస్తామని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆశచూపింది. దీంతో ఎక్కడెక్కడో ఉన్న సంతాలులంతా ‘దివానీ-కి-కోహ్’ ప్రాంతానికి చేరుకున్నారు. వారందరికీ భూములిచ్చిన కంపెనీ వ్యవసాయంపై భరించరాని శిస్తులు విధించడం ప్రారంభించింది. ఆ శిస్తును వసూలు చేసేందుకు జమీందార్లను నియమించింది. ఈ జమీందార్లు శిస్తు వసూలులో అత్యంత క్రూరంగా వ్యవహరించేవారు. దీంతో భారీ శిస్తులను చెల్లించేందుకు సంతాలులు రుణదాతల్ని వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
సంతాలుల తిరుగుబాటు వార్తను బ్రిటిషర్లకు జమీందార్లు చేరవేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులను పంపారు. ఈ క్రమంలోనే వారిని బెదిరించడానికి వచ్చిన ఓ పోలీసు దరోగాను 1855, జూలై 7న సంతాల్ నాయకులు హత్య చేశారు. పెద్ద ఎత్తున చెలరేగిన ఘర్షణలు దావానంలా వ్యాపించాయి. బ్రిటిషర్లు, జమీందార్లపై సంతాల్ తిరుగుబాట్లు ఉధృతమయ్యాయి. సంతాల్లు జార్ఖండ్ నుంచి బెంగాల్ వరకు అడవులు విముక్తి పొందినట్లు ప్రకటించారు. అయితే, 1855, నవంబర్ 10న ‘దామన్-కి-కోహ్’ ప్రాంతంలో బ్రిటిష్ సర్కారు మార్షల్ లా ప్రకటించింది.
బ్రిటిషర్లపై మర్లవడ్డ సంతాలులు..
ఆంగ్లేయులు తీసుకువచ్చిన కొత్త శాశ్వత పరిష్కార చట్టం సంతాల్ తిరుగుబాటుకు దారితీసింది. ముర్ము సోదరులైన సిద్ధు, కన్హు, చంద్, భైరవ్తో పాటు వారి సోదరీమణులు ఫూలో, ఝానో నాయకత్వంలో సంతాల్లు ఉద్యమించారు. జూన్ 30, 1855 నిండు పున్నమి రోజు వేలాది మంది సంతాలులు భోగనాదిహ్ గ్రామంలో సమావేశమయ్యారు. సిద్ధు, కన్హు ప్రసంగం విన్నారు. అనంతరం ఆవేశంతో ఊగిపోయారు. జమీందార్లు, వడ్డీ వ్యాపారులు, పోలీస్ దరోగాల మీద యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. తమ అడవులను విడిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఆరోజే సంతాలుల తిరుగుబాటుకు అంకురార్పణ జరిగింది.
సంతాలుల పోరాటం సుమారు ఆరు నెలలు సాగింది. అరవై వేలమందికిపైగా సంతాలులు పాల్గొన్నారు. ఈ తిరుగుబాటును అణచివేసేందుకు బ్రిటిష్ సైన్యానికి ఏడాదికి పైగా పట్టింది. ఈ పోరాటంలో వందలాది మంది బ్రిటిష్ అధికారులు, జమీందార్లను సంతాల్లు మట్టుబెట్టారు. 20,000 కంటే ఎక్కువ మంది సంతాల్ యోధులు సిద్ధూ, కన్హూతో సహా తమ ప్రాణాలను తమ స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం అర్పించారు. తిరుగుబాటును క్రూరంగా అణచివేసినా, ఆంగ్లేయులు అటవీ చట్టాలను సవరించుకునే స్థాయిలో సంతాల్ పోరాటం కొనసాగింది. జనవరి 3, 1856న బ్రిటిష్ సర్కారు మార్షల్ లా ను తొలగించింది. దీంతో యుద్ధం ముగిసినట్టుగా ప్రకటించింది.
ఒకవిధంగా ఇది కేవలం సంతాలుల తిరుగుబాటు మాత్రమేకాదు. అది బ్రిటిష్ సర్కారుకు వ్యతిరేకంగా భారతీయ రైతుల ప్రథమ సంగ్రామం. అయితే, ఎందుకో ఇంతటి విశిష్టత కలిగిన ఈ సంగ్రామాన్ని మాత్రం దేశ చరిత్రకారులు చిన్నచూపు చూశారు. చరిత్రపుటల్లో దానికి తగినంత ప్రాధాన్యం లభించకపోవడానికి కారణం పోరాటం చేసినవాళ్లు అమాయక అడవిబిడ్డలు కావడమే. ఇది మాత్రం దాచినా దాగని సత్యం.
-బసవరాజు నరేందర్రావు, న్యాయవాది