..నిండు గోదారిలో ఈదుకుంటూ
ఆయన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన యోధుడు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజే ఆంక్షలను ధిక్కరిస్తూ తన స్వగృహంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ధీరుడు. తనతోపాటు స్వాతంత్య్ర సంగ్రామానికి ఎంతో మంది యువకులను తయారుచేసిన స్ఫూర్తిప్రదాత కేవీ కేశవులు.
ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కేవీ కేశవులు తన 20వ ఏటనే మక్తేదార్. స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపారు. తన పోరాటాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు అజ్ఞాతవాసం గడిపారు. తనతోపాటు ఎందరో యువ కార్యకర్తల్ని స్వాతంత్య్ర పోరాటానికి సన్నద్ధుల్ని చేశారు. కరీంనగర్తోపాటు ఆదిలాబాద్ జిల్లాలో సైతం గళమెత్తారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించిన రోజున ఇక్కడ ఆంక్షలున్నా ధర్మపురిలోని తన స్వగృహంపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. స్థానిక పెద్దలందరీతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన పోలీసులు నాన్బెయిలెబుల్ వారెంటు జారీ చేయగా, నిండు గోదావరిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఆదిలాబాద్ జిల్లాకు చేరారు.
జాతీయపోరాటంలో భాగంగా పైస్థాయి నాయకుల ఆదేశానుసారం అజ్ఞాతంలోనే ఉంటూ ఉద్యమం నడిపారు. తర్వాత ఇండియన్ యూనియన్లో నిజాం ప్రభుత్వం విలీనమైనట్లు వార్తలు రావడంతో సైన్య సుబేదారితో కలిసి ధర్మపురి గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. ధర్మపురి ఆలయంలో పూజలు చేసి, పోలీస్స్టేషన్పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తర్వాత కాలంలో జౌళి శాఖ మంత్రితో పాటు వివిధ పదవులను చేపట్టారు కేవీ కేశవులు. 2019 జనవరి 31న వయోభారంతో మృతి చెందగా, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.