పుణె : హీరో ఆఫ్ ఎన్విరాన్మెంట్గా పిలుచుకునే సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఎండీ తులసి తంతి (64) శనివారం రాత్రి కన్నుమూశారు. ఛాతీలో నొప్పితో పుణెలోని ఓ దవాఖానలో చేరిన తులసి తంతిని బతికించేందుకు వైద్యులు చాలా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. సుజ్లాన్ గ్రూప్ మరియు సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రధాన ప్రమోటర్లలో తులసి తంతి ఒకరు. ఈయనను విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. తులసి తంతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజ్కోట్కు చెందిన తులసి తంతి.. తొలుత తన వ్యాపారాలను అహ్మదాబాద్లో ప్రారంభించి.. అనంతరం పుణెకు మకాం మార్చి ఇక్కడే స్థిరపడ్డారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) పునరుత్పాదక ఇంధన మండలి ఛైర్మన్గా సేవలందించిన తులసి తంతి.. ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ నిపుణుడిగా నిలిచారు. 1995 లో పునరుత్పాదక ఇంధన పరిశ్రమను స్థాపించిన తులసి తంతి.. అతి తక్కువ సమయంలో దేశంలోనే అతిపెద్ద పవన ఇంధన సంస్థగా అవతరించేలా చేయగలిగారు. ఈయన కంపెనీ 19.4 గిగా వాట్ల పవన శక్తి సామర్ధ్యం కలిగి ఉండి.. మన దేశంలో 33 శాతం మార్కెట్తో 17 దేశాల్లో తన వ్యాపారాలను విస్తరించింది.
ఇండియన్ విండ్ టర్బైన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యూటీఎంఏ) అధ్యక్షుడిగా, ఢిల్లీలోని టీఈఆర్ఐ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యుడుగా కొనసాగారు. ఎనర్జీ రంగంలో ‘ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్’, ‘హీరో ఆఫ్ ది ఎన్విరాన్మెంట్’ వంటి అనేక అవార్డులను అందుకున్నారు. తొలినాళ్లలో వస్త్ర వ్యాపారాన్ని నిర్వహించిన తులసి తంతి.. 1995 నుంచి పునరుత్పాదక ఇంధన రంగంలోకి దిగారు. ప్రస్తుతం సుజ్లాన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ రూ.8,535.90 కోట్లుగా ఉన్నది.