అమరావతి : తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. ఈ బ్యారేజీ నుంచి 8,700 క్యూసెక్కుల నీటిని పంట కాల్వలకు, సముద్రంలోకి 23 లక్షల క్యూసెక్కల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పూర్తిగా వరద తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు గ్రామస్థులకు సూచించారు.
ఇది ఇలా ఉండగా వరద ప్రవాహాన్ని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. వరదతో ముంపునకు గురైన లంక గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయ చర్యలను చేపట్టారు. ఇప్పటి వరకు 97వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఇప్పటివరకు 84 వేల మందిన 191 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు.
వరద ప్రాంతాల్లో 256 వైద్య శిబిరాలు, 1,25,015 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద స్వల్పంగా తగ్గింది. స్పిల్వే వద్ద 36.3 మీటర్లకు వరద నీరు చేరగా 48 గేట్ల ద్వారా 20.28 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.