అమరావతి : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాధిత కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదుకు సకాలంలో స్పందించలేదన్న ఆరోపణలో మేరకు విజయవాడ నగరంలోని నున్న సీఐ. సెక్టార్ ఎస్సైపై వేటు వేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ ప్రబుద్ధుడు మానసిక దివ్యాంగురాలైన యువతికి ఉద్యోగం ఆశ చూపి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఆస్పత్రిలో మరో ఇద్దరు ఒప్పంద కార్మికులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడారు. ఘటనకు ముందు తమ కూతురు కనిపించడం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులు నున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నిందితుడి నుంచి వచ్చిన ఫోన్ నంబర్ను పోలీసులకు అందజేశారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో దారుణం జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ బాధితులు, కాలనీవాసులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదుకు సకాలంలో స్పందించని సీఐ హనీష్, సెక్టార్ ఎస్సై శ్రీనివాసరావును సస్పెన్షన్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు.