కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారత సంతతి కుటుంబం హత్యకు గురికావడానికి పాతకక్షలే కారణమని పోలీసులు తేల్చారు. హత్యకు గురైన కుటుంబానికి, హంతకుడికి మధ్య గతంలో వివాదాలు ఉన్నాయని గుర్తించారు. గత సోమవారం కాలిఫోర్నియాలో ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరి, ఆమె తండ్రి జస్దీప్ సింగ్ (36), తల్లి జస్లీన్ కౌర్ (27), పెదనాన్న అమన్దీప్సింగ్ (39) కిడ్నాప్కు గురయ్యారు.
కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు బుధవారం స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయ భూమిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కిడ్నాప్ జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా జీసస్ మాన్యుయేల్ సల్గడో అనే 48 ఏండ్ల వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో జస్దీప్ సింగ్కు చెందిన ట్రక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం చేసినట్లు దర్యాప్తు తేలిందని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. జస్దీప్ సింగ్ కంపెనీలో నిందితుడు సల్గాడో డ్రైవర్గా పనిచేశాడు. ఆ సందర్భంగా వారి మధ్య గొడవలు జరిగడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇది మనసులో పెట్టుకున్న సల్గాడో అప్పట్లో సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడు కుటుంబం అంతటిని కిడ్నాప్ చేసి హతమార్చాడు. సల్గడోకు నేర చరిత్ర ఉన్నదని, గతంలో అతడు 10 ఏండ్లు జైల్లో ఉండి వచ్చాడని పోలీసులు తెలిపారు.