శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మరోసారి సోమవారం అర్ధరాత్రి కుంజ్వాని ప్రాంతంలో డ్రోన్ సంచరించినట్లు బలగాలు పేర్కొన్నాయి. అయితే, దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. గత రెండు రోజుల్లో నాలుగుసార్లు డ్రోన్లు సంచరించాయి. ఇందులో రెండింటితో స్వల్ప నష్టం జరిగింది. సోమవారం రత్నుచక్ -కలుచక్ మిలటరీ ప్రాంతంలో కనిపించిన రెండు డ్రోన్లను గమనించిన అప్రత్తమైన దళాలు తరిమివేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ పబ్లిక్ రిలేషన్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి మరో రెండు డ్రోన్లు పాక్ నుంచి భారత్ వైపునకు దూసుకొచ్చాయి. ఒకటి బహిరంగ ప్రదేశంలో పేలిపోగా.. మరో డ్రోన్ కారణంగా భవనం పైకప్పు స్వల్పంగా దెబ్బతిన్న విషమం తెలిసిందే. ఇదిలా ఉండగా.. జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడిని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించి, సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది.