‘ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. తెలంగాణలో వచ్చే యాసంగి నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్సీఐ నుంచి వచ్చిన లేఖ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలే సాగు చేయాలి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల
జగదీశ్రెడ్డి అన్నారు. ఈ వానకాలం మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అందుకుగానూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టంచేశారు. వానకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై సూర్యాపేటలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుంటకండ్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని, కంటికి రెప్పలా చూసుకుంటున్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి రైతునూ కాపాడుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రైతాంగానికి రాబోయే ప్రమాదాన్ని ముందుగా చెప్పడం బాధ్యతగా భావించి పంటలపై సూచనలు చేస్తున్నాం తప్ప.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాదిరి రైతులను నట్టేట ముంచాలనే కుతంత్రాలు పన్నబోమని పేర్కొనారు.
సూర్యాపేట, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ మేరకు రాష్ట్రంలో వచ్చే యాసంగి నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్సీఐ నుంచి లేఖ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను సాగు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఈ వానకాలం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 333 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం స్థానిక బాలాజీ కన్వెన్షన్లో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘యాసంగి పంటల సాగు-వానకాలం ధాన్యం కొనుగోలు’పై సమీక్షలో ఆయన మాట్లాడారు. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకునేది సీఎం కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. నేడు వ్యవసాయ ఉత్పత్తులపై చర్చ జరుగుతుందని, రాష్ట్రంలో ప్రతి రైతునూ కాపాడుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దాదాపు ఆరవై ఏండ్లు రైతులు దోపిడీకి గురయ్యారని, వారిని ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో రైతు జీవితం దుర్భరంగా మారిందన్నారు. ఏ ఒక్క రోజూ రైతులకు సాయం చేయాలని ఆలోచన చేయలేదన్నారు. రైతాంగానికి రాబోయే ప్రమాదాన్ని ముందే చెప్పడం తమ బాధ్యతగా భావించి పంటలపై సూచనలు చేస్తున్నామే తప్ప, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాదిరిగా రైతాంగాన్ని నట్టేటా ముంచాలనే కుతంత్రాలు పన్నబోమన్నారు. గత మూడు, నాలుగేండ్లుగా రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, వాటిని ఎఫ్సీఐ తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్గా ఉండి బ్యాంకుల నుంచి వడ్డీకి తెచ్చి వాటిని ప్రభుత్వమే భరించిందని గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ కల్లాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం దేశంలోనే మరేదైనా ఉన్నాదా? అని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ఒక్క ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా రైతును దగ్గర కూర్చోబెట్టుకొని వారి సాధకబాధకాలను విన్నారా? వ్యవసాయంలో లాభసాటి ఏది? ఏ పంటలు పండించాలనే సూచనలు చేశారా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. రైతులను గాలికి వదిలేయమని చెబుతున్నారని మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థ అయిన ఎఫ్సీఐ రాష్ట్రం నుంచి ఒక్క గింజా కొనమని తేల్చి చెప్పింది. దమ్ముంటే బీజేపీ నాయకులు ప్రధానితోనో లేదా కేంద్ర మంత్రులతోనో ఎంత ధాన్యం కొనుగోలు చేయగలదో చెబితే అంతే పండించాలని రైతులకు చెబుతామన్నారు. సిగ్గు, లజ్జ విడిచి రైతులను నట్టేటా ముంచేలా బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రధానితో లేదా వ్యవసాయ మంత్రి, ఎఫ్సీఐతో చెప్పించాలి తప్ప ఇక్కడ దీక్షలు చేయడం ఎవరిని మోసం చేసేందుకు అని ప్రశ్నించారు.
లాభదాయక పంటలు పండించాలి
వరికి బదులు లాభదాయక పంటలు పండించాలని, మార్కెట్లో ధర అధికంగా ఉండే పంటలపై దృష్టి పెట్టేలా రైతులను మోటివేట్ చేయాలని సూచించారు. ఈ వానకాలం 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి అయ్యే అవకాశం ఉన్నందున జిల్లాలో 333 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
ఏదీ వద్దనలే.. డిమాండ్ పంటలే వేయాలంటున్నం
ప్రతిపక్షాలు వరి వేయవద్దని ప్రభుత్వం చెబుతుందని ప్రచారం చేస్తున్నాయని, అసలు వరి వేయవద్దని చెప్పడం లేదని మంత్రి చెప్పారు. ఎఫ్సీఐ కొనుగోలు చేయమని లేఖ వచ్చినందున ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని, అందుకే వరికి బదులు ఇతర పంటలు వేయాలంటున్నామన్నారు. ఎవరైనా తిండి కోసమో, మిల్లర్లతో ఒప్పందం చేసుకొని సన్న వడ్లు వేసుకున్నా వారి ఇష్టమే తప్ప ఎవరూ వద్దని చెప్పరన్నారు. ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు చేయనన్నందున రైతులను కాపాడుకునేందుకు డిమాండ్ ఉన్న పంటలు వేయాలని సూచిస్తున్నామన్నారు. అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కల్టెర్ మోహన్రావు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణగౌడ్, డీఏఓ రామారావునాయక్, డీఎస్ఓ విజయలక్ష్మి, ఉద్యాన అధికారి శ్రీధర్, డీఆర్డీఓ కిరణ్కుమార్ పాల్గొన్నారు.