సూర్యాపేట, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం శాసనమండలిలో కూరగాయల సాగుపై జరిగిన చర్చ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూర్యాపేటలో సాగవుతున్న మిద్దెతోటల గురించి ప్రస్తావిస్తూ జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని అభినందించారు. మంత్రి తన ప్రసంగంలో రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తుందని వెల్లడిస్తూ ప్రధానంగా ప్రజలు మిద్దె పంటల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీలో మంత్రి జగదీశ్రెడ్డి చొరవ, ప్రోత్సాహంతో 1500 మంది ఇంటి మిద్దెలపై కూరగాయలు పండిస్తున్నారని ప్రస్తావించారు. సూర్యాపేటలో మిద్దెతోటల్లో పండిస్తున్న కూరగాయలు ఆయా కుటుంబాలకు సరిపడడమే కాకుండా స్నేహితులు, బంధువులకూ పంపిణీ చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసిందని, ఇది ఎంతో సంతోషకరమని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 143 పట్టణ ప్రాంతాలు, 13కార్పొరేషన్ల పరిధిలో కూరగాయల సాగుకు తగిన ప్రోత్సాహం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.