నల్లగొండ ప్రతినిధి, మార్చి 20(నమస్తే తెలంగాణ) : తొలి ప్రాధాన్యత ఓట్లలో ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని అందించి తదుపరి ప్రాధాన్యత ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థికి విజయం కట్టబెట్టారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ పాలనకు పట్టభద్రులు మరోసారి జై కొట్టారు. మీ వెంటే మేమంటూ మద్దతుగా నిలిచారు. ల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర్ రెడ్డిని వరుసగా రెండోసారి శాసన మండలికి పంపించారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇతర అభ్యర్థులు అసత్యారోపణలు, అభూతకల్పనలతో కుట్రలు చేసే ప్రయత్నాలు చేసినా ఓటర్ల తీర్పు ముందు అవన్నీ బలాదూర్ అయ్యాయి. నిర్విరామంగా, సజావుగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసాంతం ఆసక్తికరమే. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే మెజారిటీ దక్కగా, రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడో స్థానంలో కోదండరామ్ నిలిచారు. బీజేపీ, కాంగ్రెస్ను ఓటర్లు నాలుగు, ఐదు స్థానాలకు పరిమితం చేశారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మరోసారి విజయం సాధించారు. పల్లా రాజేశ్వర్రెడ్డి వరుసగా రెండోసారి ఇక్కడి నుంచి విజయం సాధించగా ఈ స్థానం ఏర్పడిన నాటి నుంచి నాలుగుసార్లు ఎన్నికలు జరగ్గా అన్నిసార్లు గులాబీ జెండానే ఎగిరింది. ఇది టీఆర్ఎస్ కంచుకోట అని ఇక్కడి పట్టభద్రులు మరోసారి నిరూపించడం విశేషం. ఏడు రౌండ్ల తొలి ప్రాధాన్యత ఓట్లలోనే స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించినా గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. ఎలిమినేషన్ పద్ధ్దతిలో తదుపరి ప్రాధాన్యత ఓట్లలోనూ సత్తా చాటుతూ విజయం దిశగా అడుగులు వేశారు.
ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,87,969 ఓట్లు పోలవ్వగా వాటి లెక్కింపు ప్రక్రియను ఈ నెల 17వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నల్లగొండలోని ఆర్జాలబావి పరిధిలోని గోదాముల్లో ప్రారంభించారు. అదేరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ఏడు రౌండ్లలో పూర్తి చేశారు. ఒక్కో రౌండ్లో 56వేల ఓట్లను లెక్కించగా ప్రతి రౌండ్లోనూ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. మొత్తం 3,66,333 ఓట్లు చెల్లుబాటు కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థ్ధి రాజేశ్వర్ రెడ్డికి 1,10,840 తొలి ప్రాధాన్యత ఓట్లు దక్కాయి. తీన్మార్ మల్లన్న 83,290 ఓట్లతో ద్వితీయ స్థానంలో, కోదండరామ్ 70,072 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి 39,107ఓట్లు, కాంగ్రెస్ రాములునాయక్కు 27,588 ఓట్లు, సీపీఐ అభ్యర్థ్ధి జయసారథి రెడ్డికి 9,577, చెరుకు సుధాకర్కు 8,631, రాణీరుద్రమకు 7,756 ఓట్లు వచ్చాయి. వీరితో బరిలో ఉన్న ఇతర అభ్యర్థ్ధులకు నామమాత్రపు ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ మొత్తం పోలైన ఓట్లలో 21,636 చెల్లని ఓట్లు పోగా మిగిలిన 3,66,333 చెల్లిన ఓట్లలోంచి సగానికి ఒకటి ఎక్కువ అంటే 1,83,167ను గెలుపు కోటాగా నిర్ధారించారు.
ఎలిమినేషన్ రౌండ్స్లో పల్లా గెలుపు ఖరారు
తొలి ప్రాధాన్యతలోనే పల్లా 27,550 ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నా… మొత్తం చెల్లిన ఓట్లలో సగం అయిన 1,83,167 మేజిక్ ఫిగర్ను చేరుకోవడానికి చాలా దూరంలో ఉన్నారు. ఈ దశలో అధికార యంత్రాంగం ఎలిమినేషన్ పద్ధతిలో అభ్యర్థుల ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో ప్రారంభించి తదుపరి ప్రాధాన్యతల ప్రకారం ఓట్ల లెక్కింపును చేపట్టింది. ముందుగా అతి తక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లను పొందిన అభ్యర్థి నుంచి మొదలు పెట్టి చివరకు ఒక్కరు మిగిలే వరకు ఎలిమినేషన్ పద్ధతిలో ఈ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం స్వతంత్రులైన 59 మంది అభ్యర్థ్ధుల బ్యాలెట్లలో ఆయా అభ్యర్థులకు వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించినా.. ఫలితం దక్కలేదు. దీంతో ముందుగా రాణీరుద్రమను ఎలిమినేట్ చేశారు.
తర్వాత వరుసగా చెరుకు సుధాకర్, జయసారథిరెడ్డి, రాములునాయక్, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఎలిమినేట్ అయ్యారు. బీజేపీ అభ్యర్థ్ధి ప్రేమేందర్రెడ్డి ఎలిమినేషన్ పూర్తయ్యే సరికి పల్లా రాజేశ్వర్రెడ్డికి 132921ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 1,08,253 ఓట్లు, కోదండరామ్కు 1,03,030 ఓట్లు రాగా పల్లానే 24,668 ఓట్ల ఆధిక్యత కలిగి ఉన్నారు. ఈ క్రమంలో తృతీయ స్థానంలో ఉన్న కోదండరామ్ను ఎలిమినేట్ చేస్తూ ప్రాధాన్యత ఓట్లను పంచారు. ఈ రౌండ్లో వచ్చిన తదుపరి ప్రాధాన్యత ఓట్లతోపాటు అంతకు ముందే ఉన్న స్పష్టమైన మెజార్టీ ఓట్లతో కలుపుకుని అత్యధిక ఓట్లు సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థ్ధి పల్లా రాజేశ్వర్రెడ్డి తన విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న బ్యాలెట్లలో ఉన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కూడా పరిగణలోకి తీసుకుంటూ అందులో పల్లాకు వేసిన ఓట్లను కూడా లెక్కించారు. ఈ ప్రక్రియ అంతా అర్ధరాత్రి వరకు కొనసాగింది.
ప్రభుత్వ పాలనకు మద్దతుగా పట్టభద్రులు..
ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదంటూ, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు చేసిన అసత్య ఆరోపణలను తిప్పికొడుతూ పట్టభద్రులు టీఆర్ఎస్ పాలనకు పట్టంకట్టారు. తప్పడు ప్రచారాలతో ఓటర్లను గందరగోళానికి గురిచేయాలని చేసిన అన్ని ప్రయత్నాలను పట్టభద్రులు తిప్పికొడుతూ చెంపపెట్టు లాంటి తీర్పును ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం తీసుకురావడమే కాకుండా.. ఇప్పుడు ఆ రాష్ర్టాన్ని సమగ్రాభివృద్ధి దిశగా పయనింపజేస్తున్న కేసీఆర్ సర్కార్ పాలనకు పట్టభద్రులు జై కొట్టినట్లుగానే ఈ విజయాన్ని భావిస్తున్నారు. ఉమ్మడి మూడు జిల్లాల్లోని పట్టభద్రులంతా దాదాపు ఒకేతీరుగా తమ తీర్పును ఇచ్చినట్లు కౌంటింగ్ సరళి వెల్లడిచేసింది. ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. ప్రతి రౌండ్లోనూ 3,700 నుంచి 4,200 వరకు అధిక్యతను చేకూర్చారు.
ఆరున్నరేళ్ల కేసీఆర్ పాలనలోనే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలు.. అనేక పథకాల గురించి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్లకు చేరవేయడంలో సఫలమయ్యారు. 1.32లక్షల ఉద్యోగాల భర్తీ వివరాలు… కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల, సిబ్బంది జీతభత్యాల పెంపు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలతోపాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శ్రేణులు సక్సెస్ అయ్యాయి. విపక్షాలు ఎన్నిరకాల కుటిల ఆరోపణలు చేసినా వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. ఇక ఉద్యోగ, ఉపాధ్యాయులతోనూ ఆది నుంచి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారంపైనా కేసీఆర్ చూపిన చిత్తశుద్ధికి మంచి మద్దతు లభించినట్లు కౌంటింగ్ సరళి స్పష్టం చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థ్ధులందరితోపాటు స్వతంత్ర అభ్యర్థ్ధులు సైతం టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఎలాగైనా పల్లాను ఓడించడమే లక్ష్యంగా పనిచేసినా టీఆర్ఎస్ గెలుపు పై ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయారు.
90గంటల పాటు లెక్కింపు ప్రక్రియ..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంలో బుధవారం ఉదయం 8 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించగా.. సాయంత్రం 5 గంటల వరకు 25 ఓట్లకు ఒక కట్టను కట్టే కార్యక్రమమే కొనసాగింది. తర్వాత ఆరు గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం మొదలుపెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున 4గంటల వరకు మొత్తం 34గంటలపాటు ఇదే కొనసాగింది. గెలుపు కోటా ఎవ్వరికీ రాకపోవడంతో అక్కడి నుంచి ఎలిమినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి మొత్తం 71 మందిలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమం కూడా సుదీర్ఘ సమయాన్ని తీసుకుంది. శనివారం రాత్రి 12గంటల వరకు సుమారు 44గంటల పాటు కొనసాగింది. మొత్తం 90 గంటలకు పైగా రికార్డు సుదీర్ఘ సమయం తీసుకుంది.
అయితే ఇంత సుదీర్ఘంగా సాగిన లెక్కింపు ప్రక్రియలో ఎక్కడ కూడా చిన్న పొరపాటుకు తావు ఇవ్వలేదు. షిఫ్టుల వారీగా విధుల్లోకి వచ్చిన ప్రతి ఉద్యోగి లేదా సిబ్బంది చాలా అంకితభావంతో ఇందులో పాల్గొని సక్సెస్ చేశారు. ఇక ఆర్ఓగా వ్యవహరిస్తున్న కలెక్టర్ పీజే పాటిల్, జాయింట్ కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్శర్మ, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఏఆర్ఓలు అవిశ్రాంతంగా విధులు నిర్వర్తించారు. ఇదే సమయంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది, అధికారులు నిర్వహించిన చర్యలతో లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎస్పీ రంగనాథ్ ఎప్పటికప్పుడు సిబ్బందిని పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలను సమీక్షించారు. పోలింగ్తోపాటు కౌంటింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఆర్వో, జిల్లా కలెక్టర్ పీజే పాటిల్ స్పందిస్తూ సుదీర్ఘ ప్రక్రియను విజయవంతంగా ముగించడానికి సహకరించిన అభ్యర్థ్ధులు, ఏజెంట్లు, అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.