పొట్టి క్రికెట్లో టీమిండియాకు వెన్నెముకలా మారాడు.. పిచ్ ఎలా ఉన్నా బంతిని బౌండరీ దాటించే సత్తా.. ఒత్తిడికి తలొగ్గని పట్టుదల.. ఇవన్నీ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాజీలు చెప్పిన మాటలే. ఈ ఏడాది టీ20 క్రికెట్లో భారత్ సాధించిన విజయాల్లో దాదాపు అన్నింట్లోనూ సూర్యకుమార్ హస్తం ఉంది.
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కూడా ఇదే జరిగింది. బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉన్న పిచ్పై సూర్యకుమార్ రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలతో భారత్ను విజయం వైపు నడిపించాడు. ఈ క్రమంలో సూర్యపై సఫారీ సీనియర్ పేసర్ వేన్ పార్నెల్ ప్రశంసల వర్షం కురిపించాడు.
‘కొన్ని నెలలుగా నేను వ్యక్తిగతంగా చూసిన ఆటను బట్టి.. ప్రస్తుతం టీ20ల్లో బెస్ట్ బ్యాటర్ అతనే. మొత్తం 360 డిగ్రీల్లో పరుగులు సాధిస్తాడు. అలాంటప్పుడు బౌలర్లు డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. ప్రతి బంతిపై ఫోకస్ ఉంటేనే అది సాధ్యం’ అని పార్నెల్ చెప్పాడు. అయితే తొలి టీ20లో సూర్యకు అదృష్టం కూడా కలిసొచ్చిందని అభిప్రాయపడ్డాడు.
ఏదేమైనా ఇటీవలి కాలంలో సూర్య అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడని కొనియాడాడు. అదే సమయంలో తమ జట్టులో కూడా ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్నారని, కాబట్టి తాము సిరీస్ గురించి ఆందోళన చెందడం లేదని తేల్చిచెప్పాడు. తొలి మ్యాచ్లో పిచ్ టీ20 క్రికెట్కు అనుకూలమైంది కాదని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో భారత బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాడు. ఈ రెండు జట్లు గువాహటి వేదికగా ఆదివారం నాడు రెండో టీ20 మ్యాచ్లో తలపడనున్నాయి.