భోపాల్ : మధ్యప్రదేశ్ను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. శివపురి జిల్లాలో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగడంతో.. నివాసాల మధ్యకు మొసళ్లు చేరుకుంటున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొసళ్లు ఇండ్ల మధ్యకు రావడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మొదట బస్టాండ్ వద్ద ఓ మొసలి కనిపించిందని గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వాత నివాసాల మధ్యకు చేరుకుని, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ మొసళ్లను పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న మాధవ్ నేషనల్ పార్క్ నుంచి అటవీ శాఖ అధికారులు వచ్చారు. గంటల పాటు శ్రమించి ఓ 8 అడుగుల పొడవున్న మొసలిని బంధించారు. అనంతరం సంఖ్యా సాగర్ లేక్లో వదిలేశారు.