ముంబై: బాలికా వధు హిందీ టీవీ సీరియల్ ఓ బిగ్గెస్ట్ హిట్. ఆ సీరియల్ను తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో ప్రసారం చేశారు. సురేఖా సిక్రి ఆ సీరియల్లో కీలక పాత్ర పోషించారు. బాలికా వధు సీరియల్లో దాదిసాగా సురేఖ నటించిన తీరు అసాధారణం. విభిన్న పార్శ్వాల్లో ఆమె తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆమె పర్ఫార్మెన్స్కు టీవీ ప్రేక్షకులు థ్రిలయ్యేవారు. నిజానికి దాదిసా ఓ నెగటివ్ రోల్. కానీ ఆమె నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కట్టిపడేసింది. అద్భుతమైన రీతిలో హావభావాలు ప్రదర్శించేది. టీవీ సీరియళ్లలో బాలికా వధు ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. అసలు నటన అంటేఎలా ఉండాలన్న రీతిలో సిక్రి పర్ఫార్మెన్స్ సాగేది. సీన్లో ఎమోషన్స్ పండించడంలో సురేఖ దిట్ట అనడం ఆశ్చర్యం కాదు.
దాదిసా పాత్ర చిరస్మరణీయమైంది. సామాజిక రుగ్మతలు, అనాగరిక సంప్రదాయాలను వ్యతిరేకించే రీతిలో ఆ సీరియల్ సాగుతుంది. కలర్స్ టీవీలో బాలికా వధు సీరియల్ 2008లో ప్రసారం అయ్యింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఆ సీరియల్ కొనసాగింది. రాజస్థానీ వృద్ధ మహిళ డోక్రీ తరహాలో సురేఖ తన దాదిసా పాత్రలో మైమరిపించారు. ఆమె శక్తివంతమైన నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. కొన్ని సందర్భాల్లో అది కోపం కూడా తెప్పిస్తుంది. ఆ సిరీయల్లో ఆనందీ పుస్తకాలను ఆమె కాల్చివేస్తుంది. ఆ సమయంలో సిక్రీ నటనను చూస్తే.. నేటి తరం వాళ్లకు వళ్లు మండిపోతుంది. అంతేకాదు, ఎమోషనల్ సీన్స్లో ఆమె పండించే అభినయం.. ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సురేఖ సభ్యురాలు. సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. బాలిక వధులో తన నటనతో ఎందరో హృదయాలను ఆమె గెలుచుకున్నది. మూడుసార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నది. తమాస్(1988), మమ్మో(1995), బదాయి హో(2018) చిత్రాల్లో ఆమె నటనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. 1989లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు కూడా ఆమె గెలుచుకున్నారు.
ఉత్తరప్రదేశ్లో సిక్రీ జన్మించారు. ఆమె తండ్రి వైమానిక దళంలో చేశారు. ఆమె తల్లి టీచర్. 1971లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. 2018లో ఆమెకు పక్షవాతం వచ్చింది. అయితే ఆమె వీల్చైర్పై వచ్చి బదాయి హో చిత్రానికి అవార్డును అందుకోవడం గమనార్హం. ఇవాళ గుండెపోటుతో దాదిసా సురేఖా సిక్రి కన్నుమూశారు.