ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చల పేరిట విద్వేషం వరదలై పారుతుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటని మోదీ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత ఈ సందర్భంగా గుర్తురాక మానదు. 140 కోట్ల మందిని బాధ్యతాయుతంగా, రాజ్యాంగబద్ధంగా పాలించాల్సిన సర్కారు పెద్దలే అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం, యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిళ్ళ కు గురవుతున్న మీడియాలో విద్వేష ప్రచారాలకు అడ్డుకట్ట ఎట్లా పడుతుంది? నిజానికి జాతీయ మీడియా పేరుతో ప్రసారమయ్యే హిందీ, ఇంగ్లిష్ టీవీ ఛానళ్లలో అనేకం ప్రజాస్వామిక విలువలను కోల్పోయి చాలా రోజులైంది.
తొలినుంచీ ఉత్తరాదికీ అందులోనూ ఢిల్లీ, ముంబై వంటి మహా నగరాలకే ప్రాధాన్యం ఇచ్చే ధోరణి ఈ ‘జాతీయ ఛానళ్ల’లో ఉండేది. అయితే, మోదీ హయాం ఎనిమిదేండ్ల కిందట మొదలైన తర్వాత ఇవి మునుపటి ప్రాంతీయ వివక్షను కొనసాగించటమేగాక కొత్తగా మత వివక్షనూ నూతన ప్రభువుల వద్ద నుంచి అందిపుచ్చుకున్నాయి. మైనారిటీ మతస్థులపై ఎంత విషం చిమ్మితే అంత గొప్ప, అదే టీఆర్పీ రేటింగ్లకు ప్రాతిపదిక అన్న అధఃప్రమాణం స్థిరపడిపోయింది. దీనికితోడు కేంద్ర సర్కారు, వారి దగ్గరి వ్యక్తుల అండదండలతో తామర తంపరగా న్యూస్ ఛానళ్లు పెరిగిపోయాయి. ఒక అంశంపై నలుగురిని కూర్చోబెట్టి వారినుంచి అభిప్రాయాలు తీసుకోవటం, చర్చను సమన్వయపరచటం అనే వృత్తిధర్మాన్ని అనేకమంది యాంకర్లు విడిచిపెట్టారు. చర్చలో పాల్గొనేవారిని మాట్లాడనివ్వకపోవటం, గట్టిగా కేకలు వేయటం, అవమానించటం.. ఇదే ట్రెండ్గా మారిన దారుణ స్థితిని నేడు చూస్తున్నాం.
కారణం లేకుండా ఏదీ జరగదు. ఎలక్ట్రానిక్ మీడియాలో కనిపిస్తున్న ఈ పతనానికి కూడా నిర్దిష్టమైన కారణాలున్నాయి. దేశాన్నేలుతున్న బీజేపీ మన దేశ మౌలిక స్వభావాన్నే మార్చే కుట్రలను అమలుపరుస్తున్నది. ఇది గుట్టుగా కూడా ఏమీ జరగటం లేదు. ఈ దేశంలో తమ పార్టీ తప్ప ఇతర పార్టీలేవీ మిగలవని బీజేపీ జాతీయాధ్యక్షుడే బహిరంగంగా వాకృచ్చారు. దేశంలోని బహుళ సంస్కృతిని, సమాఖ్య వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఏక పార్టీ నియంతృత్వాన్ని నెలకొల్పటానికి బీజేపీ మతాన్ని ఒక ముసుగు వలె వాడుకుంటున్నది. దీంట్లో భాగంగానే ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధుల దగ్గరినుంచి స్థానిక నాయకుల వరకూ ప్రజల మధ్య మతచిచ్చు రగిలించటానికి తమ చేతనైనంత ప్రయత్నిస్తున్నారు. ప్రజలపై అమితంగా ప్రభావం చూపించే మీడియానూ హస్తగతం చేసుకొని, అక్కడా ఇటువంటి వికృత ధోరణినే అమలు పరుస్తున్నారు. దీనిని సుప్రీంకోర్టు ఇప్పటికైనా నిలదీయటం మంచి పరిణామమే. ఈ మత విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవటానికి సకల వర్గాలూ ఏకం కావాలి.