న్యూఢిల్లీ: జార్ఖండ్లో జడ్జి(Jharkhand Judge) ఉత్తమ్ ఆనంద్(Uttam Anand)ను ఆటోతో ఢీకొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) సుమోటో కేసు(Suo Motu)గా స్వీకరించింది. జార్ఖండ్ రాజధాని ధన్బాద్లో అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ను గురువారం గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రోడ్డుపై జాగింగ్ చేస్తున్న జడ్జిని.. వెనుకనుంచి వచ్చి ఆటోతో ఢీకొట్టారు. దాంతో ఆ జడ్జి ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనిపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కంత్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకు సంబంధించిన పూర్తి విచారణ వివరాలను కోర్టుకు సమర్పించాలని జార్ఖండ్ చీఫ్ సెక్రటరీని ధర్మాసనం ఆదేశించింది. డీజీపీ కూడా ఆ హత్యకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోర్టు కోరింది.
జాగింగ్ చేస్తుంటే..
ఉదయం 5 గంటల సమయంలో జిల్లా కోర్టు సమీపంలోని రణధీర్వర్మ చౌక్ వద్ద జడ్జిని హత్య చేశారు. తీవ్ర గాయాలై నెత్తుటి మడుగులో విలవిలలాడుతున్న జడ్జిని ఆటో డ్రైవర్ ఒకరు గమనించాడు. ఆయనను షాహిద్ నిర్మల్ మహతో వైద్య కళశాల దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ముందు ఈ ఘటనను ప్రమాదంగా పోలీసులు భావించారు. వాహనం ఢీకొట్టిన వీడియో బయటకురావడంతో పథకం ప్రకారం జరిగిన హత్యగా గుర్తించారు. జడ్జి ఆనంద్ హత్యను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్… ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.
కీలక కేసులు
జడ్జి ఆనంద్ కొన్ని హై ప్రోఫైల్ కేసులను డీల్ చేస్తున్నారు. రంజయ్ సింగ్ అనే వ్యక్తి మర్డర్ కేసును ఆ జడ్జి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. జారియా ఎమ్మెల్యే సంజీవ్ సింగ్తో ఆ మర్డర్కు లింక్ ఉన్నట్లు తేలింది. అమన్ సింగ్ అనే గ్యాంగ్కు చెందిన ఇద్దరికి బెయిల్ ఇచ్చేందుకు కూడా ఆ జడ్జి నిరాకరించారు. యూపీలో అమన్ సింగ్ ఓ గ్యాంగ్స్టర్. జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును జార్ఖండ్ హైకోర్టు కూడా సుమోటో కేసుగా స్వీకరించింది.