న్యూఢిల్లీ, అక్టోబర్ 20: లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటనల కేసు విచారణను అంతులేని కథగా మార్చొద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. క్షుణ్ణంగా పరిశీలిస్తే.. యూపీ పోలీసులు కేసు దర్యాప్తులో కావాలనే తాత్సారం చేస్తున్నట్టు అనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సెక్షన్ 164 (జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సమక్షంలో విచారణ) కింద రికార్డు చేయడంతో పాటు సాక్షులకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. యూపీ సర్కారు ఆలస్యంగా నివేదిక సమర్పించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నెల అక్టోబర్ 3న లఖింపూర్ ఖీరీలో జరిగిన హింసాత్మక ఘటన కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. కేసు నివేదికను సమర్పించడంలో యూపీ సర్కారు జాప్యాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ‘అర్ధరాత్రి ఒంటిగంట వరకు నివేదిక కోసం వేచిచూశాం. అయితే మీరు (యూపీ ప్రభుత్వం) ఎలాంటి నివేదికను సమర్పించలేదు. విచారణ రోజున నివేదికను సమర్పిస్తే మేము ఎప్పుడు దాన్ని పరిశీలించాలి’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
సెక్షన్ 164 కింద అందర్నీ ఎందుకు విచారించలేదు?
లఖింపూర్ ఖీరీ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది హరీశ్ సాల్వే సాల్వే బదులిస్తూ.. 44 మంది సాక్షులను విచారించామన్నారు. ఇందులో నలుగురి సాక్షుల వాంగ్మూలాలను సెక్షన్ 164 కింద రికార్డు చేసినట్టు తెలిపారు. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం.. మొత్తం 44 మంది సాక్షుల వాంగ్మూలాలను సెక్షన్ 164 కింద ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించింది. సెక్షన్ 164 కింద సాక్ష్యులను విచారించి వారి వాంగ్మూలాలను రికార్డు చేయాలని, అలాగే బాధితులను, సాక్షులకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.
పోలీసుల కస్టడీ కోరారా? లేదా?
‘రైతుల హత్య కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారు? జ్యుడీషియల్ కస్టడీలో ఎంతమంది, పోలీసు కస్టడీలో ఎంతమంది ఉన్నారు?’ అని కోర్టు సాల్వేని ప్రశ్నించింది. ‘మొత్తం పది మందిని అరెస్టు చేశాం. ఇందులో నలుగురు పోలీసు కస్టడీలో, ఆరుగురు జ్యుడీషియల్ కస్టడీపై జైలులో ఉన్నారు’ అని సాల్వే తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. జైలులో ఉన్న ఆరుగురు నిందితుల కోసం పోలీసుల కస్టడీని కోరలేదా? అని ప్రశ్నించింది. ‘పోలీసు కస్టడీని కోరకపోతే, జ్యుడీషియల్ కస్టడీకే పంపిస్తారు కదా’ అని ధర్మాసనం సాల్వేను ప్రశ్నించింది.
కావాలనే తాత్సారం..
లఖింపూర్ కేసులో సాక్షులను విచారించడం అవసరంలేదని, ఇప్పటికే ఘటనకు సంబంధించి ఎన్నో వీడియోలు వచ్చాయని సాల్వే కోర్టుకు తెలిపారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని.. నివేదికలు రాగానే కేసు ఓ కొలిక్కి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఈ కేసును ఓ అంతులేని కథగా మార్చొద్దని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఈ పరిణామాలను గమనిస్తే.. కేసు దర్యాప్తులో పోలీసులు కావాలనే తాత్సారం చేస్తున్నట్టు తమకు అనిపిస్తున్నదని, ఆ భావనను తొలగించాల్సిన బాధ్యత పోలీసులదేనని వ్యాఖ్యానించింది. అక్టోబర్ 26కు విచారణను వాయిదా వేసింది.
అసలేం జరిగింది?
సాగుచట్టాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 3న నిరసనలు చేపట్టిన రైతులపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనశ్రేణి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవడంతో ఆశిష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.