న్యూఢిల్లీ, అక్టోబర్ 25: నేర స్వభావం ప్రాథమికంగా వ్యక్తిగతం/సివిల్ అయినప్పుడు లేదా బాధితుడి కులంతో సంబంధం లేకుండా జరిగినప్పుడు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ప్రొసీడింగ్స్ను రద్దు చేసే అధికారం కోర్టుకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు దోషిగా నిర్ధారించిన ఓ వ్యక్తిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద చర్యలను నిలిపివేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులు అవమానాలు, వేధింపులకు గురికాకుండా కాపాడేందుకు ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని తీసుకువచ్చారని, అదే సమయంలో నేర స్వభావం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైకోర్టు దోషిగా నిర్ధారించిన వ్యక్తికి, పొరుగు మహిళకు మధ్య స్థల వివాదం ఉంది. ఆ నేపథ్యంలో జరిగిన గొడవలో ఆమెపై అతను ఇటుక విసరడంతో పాటు, ఆమె కులాన్ని దూషించాడు. ఆమె ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు పెట్టింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సదరు వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఇరువురి మధ్య రాజీ కుదిరిందని కోర్టుకు ధ్రువపత్రం సమర్పించాడు. నిందితుడి సామాజిక, ఆర్థిక వెనుకబాటును పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. అతడిపై చర్యలను నిలిపివేసింది.