సుప్రీంకోర్టు పనివేళలపై తదుపరి చీఫ్ జస్టిస్ రేసులో ఉన్న జడ్జి జస్టిస్ యూయూ లలిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు ఏడు గంటలకే స్కూల్కు వెళ్లినప్పుడు జడ్జీలు, లాయర్లు 9 గంటలకే పనిని ప్రారంభిచలేరా? అని ప్రశ్నించారు. కోర్టులు తమ దినచర్యను ముందుగానే ప్రారంభించడాన్ని సమర్థిస్తున్నట్లు జస్టిస్ యూయూ లలిత్ స్పష్టంచేశారు.
జస్టిస్ లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణను ఉదయం 9.30 గంటలకు ప్రారంభించింది. సాధారణ ప్రారంభ సమయం ఉదయం 10.30 గంటల కంటే ఒక గంట ముందుగా బెంచ్ తన పని మొదలెట్టింది. బెయిల్ వ్యవహారంలో కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి విచారణ ముగిసే సమయానికి సాధారణ సమయం కంటే ముందుగానే రోజు పనిని ప్రారంభించినందుకు బెంచ్ను ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో జస్టిస్ యూయూ లలిత్ కోర్టు పనివేళలను గంటన్నర ముందే ప్రారంభించాలని వ్యాఖ్యానించారు. కోర్టులు ఉదయం 9 గంటలకు తమ పనిని ప్రారంభించి, 11.30 గంటలకు అరగంట విరామం తీసుకొని, మధ్యాహ్నం 2 గంటలలోపు రోజు పనిని ముగించవచ్చు అని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా సాయంత్రం ఎక్కువ పనులు చేసేందుకు న్యాయమూర్తులకు ఎక్కువ సమయం దొరుకుతుందని తెలిపారు.