న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దోషుల విడుదల నిర్ణయంపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రప్రభుత్వం, గుజరాత్ సర్కారుకు నోటీసులు ఇచ్చింది. దోషులను విడుదల చేయాలని ధర్మాసనం ఎక్కడా ప్రభుత్వాన్ని ఆదేశించలేదని కీలక వ్యాఖ్యలు చేసింది. శిక్షా కాలం తగ్గింపు (రెమిషన్) పొందిన దోషులను కక్షిదారులుగా చేర్చాలంటూ పిటిషనర్లకు సూచించింది.
ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. దోషులకు రెమిషన్ను ఏ ప్రాతిపదికన మంజూరు చేశారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఆదేశాలు జారీ చేసిన బెంచ్లో జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఉన్నారు. 2002 గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగాయి. బిల్కిస్ కుటుంబానికి చెందిన ఏడుగురిని చంపిన నిందితులు, ఆపై బానోపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు ప్రత్యేక సీబీఐ కోర్టు 2008లో జీవిత ఖైదు విధించింది.