న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖీరీ కేసులో బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఈ నెల 3న లఖింపూర్ ఖీరీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు న్యాయవాదులు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. దీంతో స్పందించిన సీజేఐ నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఈ నెల 8న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేసింది.