న్యూఢిల్లీ : మహారాష్ట్ర అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కుల ధ్రువీకరణపత్రం రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ.. కేసు తదుపరివిచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
కుల ధ్రువీకరణ పత్రం రద్దు విషయంలో బొంబాయి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవనీత్ కౌర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని నకిలీదిగా హైకోర్టు ప్రకటించింది. దీంతో పాటు రూ.2లక్షల జరిమానా విధించింది. అన్ని ధ్రువపత్రాలను ఆరువారాల్లోగా సమర్పించాలని ఎంపీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులతో నవనీత్ కౌర్ పార్లమెంట్ సభ్యత్వం ప్రమాదంలో పడింది.
తప్పుడు ధ్రువీకరణపత్రంతో ఎన్నికల్లో పోటీ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఎస్సీ రిజర్వుడ్ అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. శివసేన అభ్యర్థి ఆనందరావు అడుల్స్పై విజయం సాధించారు. ఈ క్రమంలో ఆనందరావు నవనీత్ షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి కాదంటూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది.
నవనీత్ తల్లిదండ్రులు పంజాబ్కు చెందినవారు. నవనీత్ 2014లో రాజకీయాల్లోకి రాగా.. ఆమె శివసేన టికెట్పై పోటీ చేసి ఓడిపోయింది. 2019లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందింది. ఇంతకు ముందు, శివసేన నాయకుడు జైలులో పెడతామని బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి సైతం లేఖ రాశారు.