న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖీరీ కేసులో ఉత్తరప్రదేశ్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఘటన జరిగిన సమయంలో వందలాది మంది రైతులు నిరసన తెలుపుతున్నారని, అయితే, ప్రభుత్వం కేవలం 23 మందినే ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించి, వారికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. లఖింపూర్ ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సెక్షన్ 164 కింద రికార్డు చేయాలని, ఈ ప్రక్రియలో పోలీసులకు ఇబ్బందులు ఎదురైతే జిల్లా జడ్జిలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోర్టు సూచించింది. రైతుల మరణాలతో పాటు జర్నలిస్టు మృతికి సంబంధించి కూడా రెండు వేర్వేరు నివేదికలను సమర్పించాలని యూపీ సర్కారును ఆదేశించింది. కేసు విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది. కాగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనశ్రేణి దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన ఘర్షణల్లో ఒక జర్నలిస్టుతో పాటు మరో నలుగురు మృతిచెందారు. ఈ కేసులో ఇప్పటికే ఆశిష్ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విషయంలో తాత్సారం చేస్తుండటంతో ‘దీన్ని అంతులేని కథ’గా మార్చొద్దంటూ సుప్రీంకోర్టు ఇటీవల యూపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.