న్యూఢిల్లీ: నీట్ యూజీ ఫలితాల విడుదలకు మార్గం సుగమమయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్టీఏ) సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఇద్దరు విద్యార్థుల కోసం నీట్ పరీక్ష ఫలితాలను ఆపడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న బాంబే హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఫలితాలు ప్రకటించాలని ఎన్టీఏని ఆదేశించింది.
తపకు తప్పుడు సీరియల్ నంబర్లతో ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్లు ఇచ్చారని వైష్ణవి భూపాలీ, అభిషేక్ శివాజీ అనే ఇద్దరు విద్యార్థులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వారికోసం పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అప్పటివరకు ఫలితాలను విడుదల చేయకూడదని తీర్పునిచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇద్దరికోసం 16 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేయలేమని తేల్చిచెప్పింది.