హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్న ప్రభుత్వం డప్పుకు- చెప్పుకు కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. వ్యవసాయరంగానికి మాదిగలే మూలాధారమని, అదే రీతిలో తోలు పరికరాలు, తోలు వస్తువులు, చెప్పులు తయారుచేసి సమాజానికి అందిస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా డప్పు శబ్ధాన్ని వినిపించేది మాదిగలేనన్నారు. డప్పుకు- చెప్పుకు పెన్షన్ ఇచ్చి మాదిగలను ఆదుకోవాలన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి హరీశ్ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.