మహబూబ్నగర్ : పాలమూరులో రూ. 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పాత కలెక్టరేట్ స్థానంలో 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించనున్న దవాఖానను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రజలందరికి ఉపయోగపడే విధంగా నిర్మిస్తామన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ సైతం ఆమోదం తెలిపారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులతో పాత కలెక్టరేట్ పరిసరాలను, కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించేందుకు సీసీఎల్ఎ అనుమతి కూడా వచ్చిందని, కొత్త కలెక్టరేట్ లోకి మారక ముందే పాత కలెక్టరేట్ ను మెడికల్ కళాశాల డైరెక్టర్ కు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంజినీరింగ్ అధికారులు భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. పాత కలెక్టరేట్ లోనే 3 ఎకరాలలో రైతు బజార్, జనతా క్యాంటీన్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
పాత కలెక్టరేట్ భవనంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం వల్ల ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఎదురుగానే బస్టాండు, చెంతనే రైల్వేస్టేషన్ ఉండటం వల్ల రోగులు, వారి బంధువులకు ప్రయాణానికి ఇబ్బందులు ఉండబోవన్నారు. అలాగే పట్టణంలో బస్టాండ్ నుంచి సూపర్ స్పెషలిటీ ఆసుపత్రికి వచ్చేందుకు రెండు ఫుట్ ఓవర్ వంతెనలు నిర్మిస్తామన్నారు.
పట్టణమంతా 5 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలో 6 ఫ్లోర్ తోపాటు, 4 బ్లాకులను నిర్మిస్తున్నామని, ఎన్ని వాహనాలు వచ్చినా ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి మంచి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
చరిత్రలో నిలిచిపోయేలా సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
దళారుల బెడద లేకుండా ప్రభుత్వం పథకాల లబ్ధిదారులకు అందాలన్నారు. ఒకవేళ సంక్షేమ పథకాలలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఆధారాలతో సహా రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పాత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న డీఆర్డీవో భవనాన్ని, అక్కడి పరిసరాలను మంత్రి పరిశీలించారు. డీఆర్డీవో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నందున వెంటనే దాన్ని ఖాళీ చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, కె. సీతారామారావు, డీఆర్ఓ స్వర్ణలత, మెడికల్ కళాశాల డైరెక్టర్ డా. పుట్టా శ్రీనివాస్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డా.రాంకిషన్, డీఎంహెచ్ఓ డా.కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం