యాదాద్రి, ఆగస్టు 28 : మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మహిళా నాయకురాలి ఇంటిపై దాడికి యత్నించిన బీజేపీ నాయకులకు సిగ్గు లేదని మండిపడ్డారు. దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఎవ్వరెన్ని కుట్రల పన్నినా తెలంగాణ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీ కవితకు తమ పూర్తి మద్దతును ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్తోనే 8 ఏండ్లుగా రాష్ట్రంలో శాంతియుత, మానవీయమైన పాలన సాగుతున్నదని తెలిపారు. విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం పనిచేస్తున్నదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి కొట్లాడటం కొత్తకాదని, దాష్టీకాలకు పాల్పడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.