తిరుమల, జూన్ 10: విశ్వంలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై తిరుమలతిరుపతి దేవస్థానం (టీటీడీ)నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నది. విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
ఈ సందర్బంగా ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని మాట్లాడుతూ కరోనాను అరికట్టాలని, లోక కల్యాణార్థం టీటీడీ నిర్వహిస్తున్న మహామంత్ర పారాయణ యజ్ఞంలో భాగంగా, సుదరకాండ పారాయణం ప్రారంభించి నేటికి సంవత్సరము పూర్తి కాగా, మంత్ర పారాయణం 427 రోజులు పూర్తి చేసుకుందన్నారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని సుందరకాండ పారాయణం వలన బుద్ధి, బలం, ధైర్యం కలిగి సకల జీవులు ఆయురారోగ్యాలతో ఉంటాయని తెలిపారు. ఒక గొప్ప ఉద్దేశ్యంతో చేపట్టిన మహామంత్ర పారాయణం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు.