హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తు భద్రత సవాళ్లను ఎదుర్కోవడంలో డ్రోన్ టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగపడుతుందని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నిసా) డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. దీన్ని సరైన రీతిలో వాడితే ఫోర్స్ మల్టిప్లయర్ అవుతుందని చెప్పారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హకీంపేటలోని నిసా అకాడమీలో ‘అప్లికేషన్స్ ఆఫ్ డ్రోన్స్, యాంటి డ్రోన్ టెక్నాలజీస్ ఇన్ సీఐఎస్ఎఫ్’ అంశంపై సదస్సు నిర్వహించారు. దీనిలో సీఐఎస్ఎఫ్, పీఎంవో, హకీంపేట్ ఎయిర్ఫోర్స్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీకి చెందిన 50 మంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా సీవీ ఆనంద్ స్వాగతోపన్యాసం చేశారు. భవిష్యత్తు భద్రత విధుల్లో డ్రోన్లు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. సంస్థల అవసరాలకు తగ్గట్టు డ్రోన్ టెక్నాలజీ వాడకంలో ఉన్న సాధ్యాసాధ్యాలను సమీక్షించుకోవడమే సదస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన వెల్లడించారు. డ్రోన్లతో ఉపయోగం ఉన్నట్టే ప్రమాదాలూ ఉన్నాయని, ఇందుకు ఇటీవల జమ్మూలో జరిగిన ఘటనే ఉదాహరణ అని ఆయన వివరించారు. సదస్సులో పలు కంపెనీలు యాంటి డ్రోన్ టెక్నాలజీలు, డ్రోన్ల వినియోగంలోని అత్యాధునిక సాంకేతిక అంశాలను ప్రదర్శించాయి.