సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతి శెట్టి నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్మార్క్ స్టూడియోస్ పతాకాలపై బి మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు. వినూత్న ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘ఏమాయ చేసావే’ సినిమాతో నాతో పాటే సుధీర్ బాబు నట ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచి ఆయన మంచి కెరీర్ నిర్మించుకున్నారు. సహజమైన కథలతో మెప్పించడం కష్టం. కానీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. సినిమా ట్రైలర్ అందరిలో ఆసక్తిని కలిగించింది. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు’ అన్నారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ…‘ఏ కథ విన్నా అందులో కొన్ని సందేహాలు, లోపాలు కనిపిస్తాయి. కానీ ఇంద్రగంటి ఈ కథ చెప్పినప్పుడు చాలా స్పష్టంగా ఉందనిపించింది.
మా కాంబినేషన్లో మూడో చిత్రమిది. నాతో పాటు నాయిక కృతిశెట్టికి కూడా సమానమైన క్యారెక్టర్ ఉంటుంది. నేను సినిమాలో దర్శకుడి పాత్రలో కనిపిస్తాను. అమ్మాయిలు ఈ సినిమా చూస్తే హ్యాపీగా ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఇది తనకొక ప్రత్యేక చిత్రమని, కమర్షియల్ దర్శకులందరికీ ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నానని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోలు అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల పాల్గొన్నారు.