యాదగిరిగుట్ట, జూన్ 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సుప్రభాతం మొదలు పవళింపు సేవ వరకు కార్యక్రమాలు కొనసాగాయి. తెల్లవారుజామున స్వామివారి ఆలయాన్ని తెరిచి స్వామివారిని మేల్కొలిపారు. స్వామివారికి తిరువారాధన చేపట్టి బాలభోగం నివేదన చేపట్టారు. గంటపాటు స్వామివారికి నిజాభిషేకం జరిపారు. పంచసూక్తాలు, దుస్యాంతులు, సున్నాలపణం, నారాయణ, విష్ణు సూక్తాలు పఠించారు. స్వామివారికి సహస్రనామార్చన చేపట్టారు. ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చనలు జరిపించారు.
సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు కొనసాగాయి. సుమారు 18 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.22,62,855 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ జ్యుడిషియల్ సభ్యుడు దండి సుబ్రహ్మణ్యం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ పర్యవేక్షకుడు రాజన్బాబు స్వామివారి ప్రసాదం అందజేశారు. అలాగే దేవరకొండలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాన్ని దేవస్థానం తరఫున అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వస్తీవాచనం, విశ్వక్సేన ఆరాధనలతో స్వామివారి కల్యాణతంతును ఆలయ అర్చకులు ఘనంగా చేపట్టారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆలయ ఉప ప్రధానార్చకులు మోహనాచార్యులు, నరసింహమూర్తి, ఆలయ అధికారులు నరేందర్, రాంబాబు, రామారావునాయక్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట స్వామివారి క్షేత్రంలో ఈ నెల 10న సామూహిక అక్షరాభాస్యం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. కొండకింద సత్యనారాయణ వ్రత మండపం హాల్ నంబర్ 2లో సుమారు 100 మంది పిల్లలకు ఉచితంగా నిర్వహించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అక్షరాభ్యాసం చేయించుకునేవాళ్లు నేడు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.