హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వల్లే ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. సాధారణ ప్రసవాల్ల్లో ఖమ్మం మాతాశిశు కేంద్రం, కొండాపూర్ ప్రభుత్వ దవాఖానలు సాధించిన ప్రగతిని బుధవారం ట్విట్టర్లో మంత్రి అభినందించారు.
ఆ దవాఖానల కృషిపై మీడియాలో వచ్చిన కథనాలను పోస్టు చేసి సంతోషాన్ని పంచుకొన్నారు. ఒకప్పుడు నెలకు 20 కాన్పులు చేసిన కొండాపూర్ ప్రభుత్వ దవాఖాన, ప్రస్తుతం నెలకు 230 కాన్పులు చేస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. మొత్తంగా గత 4 నెలల్లో 990 కాన్పులు జరిగితే, అందులో 559 సహజ ప్రసవాలు కావడం గొప్ప విషయమని కొనియాడారు. సీ సెక్షన్ ఆపరేషన్లను 45 శాతం నుంచి 30 శాతానికి తగ్గించిన దవాఖాన సూపరింటెండెంట్ వరదాచారి, వైద్యసిబ్బందిని అభినందించారు.
అదే స్ఫూర్తిని కొనసాగించి సీ సెక్షన్ ఆపరేషన్లను మరింత తగ్గించాలని సూచించారు. ఖమ్మంలోని మతా శిశు సంరక్షణ కేంద్రంలో ఏప్రిల్లో జరిగిన 599 ప్రసవాల్లో 359 (61 శాతం) సహజ ప్రసవాలు కావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. నార్మల్ డెలివరీలను 40 నుంచి 61శాతానికి పెంచేందుకు కృషి చేసిన కలెక్టర్, వైద్యసిబ్బందిని అభినందించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, ఉచిత అంబులెన్స్ సౌకర్యం, 13 వేల నగదు ప్రోత్సాహకం తదితర పథకాలే ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని తెలిపారు.