ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 27 : ఇంద్రవెల్లిలో 1937లో మరాఠీ మీడియంతో పాఠశాలను ఏర్పాటు చేశారు. 1937 నుంచి 1939 వరకు పాఠశాల నిర్వహణ నామమాత్రంగానే ఉండేది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మరాఠీ మీడియం బోధన సాగింది. 1942లో మరాఠీ మీడియం యూపీఎస్గా మార్చారు. అప్పుడు ఈ పాఠశాలలో 168 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. 1950లో హైస్కూల్( ఒకటి నుంచి పదో తరగతి వరకు మరాఠీ మీడియం)గా మార్చిన తర్వాత విద్యార్థుల సంఖ్య 205కు చేరింది. 1953లో మరాఠీ మీడియం నుంచి తెలుగు మీడియానికి మార్చారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు మీడియం తరగతులు ప్రారంభించారు. అప్పుడు 103 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. 1985లో పదో తరగతి వరకు అప్గ్రేడ్ చేశారు. అప్పుడు 200 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. 2006లో ఇంగ్లిష్ మీడియం తరగతులు కూడా ప్రారంభించారు. మొదట ఆరో తరగతి విద్యార్థులకు మాత్రమే ఇంగ్లిష్ బోధన అందించారు. ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టుకుంటూ వచ్చారు. 2012లో మొదటిసారిగా పదో తరగతి (ఇంగ్లిష్ మీడియం) విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. అప్పటి నుంచి తెలుగు, ఇంగ్లిష్ మీడియం కొనసాగుతున్నది. ప్రస్తుతం ఇంద్రవెల్లి జడ్పీ పాఠశాలలో తెలుగు మీడియంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 1000 మంది విద్యార్థులు, ఇంగ్లిష్ మీడియంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రధానోపాధ్యాయుడు గోపాల్సింగ్తిలావత్తో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 2015, జూలై 18న బాధ్యతలు తీసుకున్న హెచ్ఎం.. ఆ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల హాజరు శాతంపై ప్రత్యేక చొరవ చూపుతూ వస్తున్నారు. తన తోటి ఉపాధ్యాయులతో కలిసి పదో తరగతిలో ఏటా 99 శాతం ఉత్తీర్ణత సాధిస్తూ వస్తున్నారు. ఏటా విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుపుతున్నారు. ఈ విషయమై ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి హెచ్ఎంను ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా పరిషత్ పాఠశాలలో వివిధ రకాల మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి. హెచ్ఎం గోపాల్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి హరితహారంపై చర్చించి పలుమార్లు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. మొక్కల చుట్టూ ప్రత్యేకంగా కంచెలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ వాటికి నీరుపోస్తూ సంరక్షిస్తున్నారు.
జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధిపై హెచ్ఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, మండల ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి రెండు అదనపు తరగతి గదులు మంజూరు చేయించారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. రోజురోజుకూ అడ్మిషన్లు పెరిగిపోతుండడంతో తరగతి గదుల కొరత ఏర్పడుతున్నది. తరగతి గదిలో 40 మంది విద్యార్థులకు మాత్రమే బోధన అందించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కో తరగతి గతిలో 50 నుంచి 60 మంది విద్యార్థులను కూర్చుండబెడుతున్నారు. పాఠశాలకు అదనంగా మరో 10 తరగతి గదులు మంజూరు చేయాలని జిల్లా అధికారులను వారు కోరుతున్నారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు సురక్షితమైన నీరు అందిస్తున్నారు. విద్యార్థులు, విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇబ్బందుల్లేకుండా వంటశాలను నిర్మించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లి జడ్పీ పాఠశాలను ఎంపిక చేసింది. దీంతో పాఠశాల మరింత అభివృద్ధి చెందే అవకాశమున్నది. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మరిన్ని వసతులు అందుబాటులోకి వస్తాయి. నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది.
ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంలో మా పాఠశాలను ఎంపిక చేసింది. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. మా పాఠశాల మరింత అభివృద్ధి చెందుతుంది. కార్పొరేట్కు దీటుగా అన్ని రకాల మౌలిక సదుపా యలతో పాటు వసతులు అందుబాటులోకి వస్తాయి. మా పాఠశాల రూపురేఖలు మారిపోతా యి. పిల్లలకు మెరుగైన విద్య అందుతుంది. మా పాఠశాలకు మరింత గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. రాష్ట్రస్థాయిలో నంబర్వన్గా నిలిపేందుకు తోటి ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటా. మండల ప్రజాప్రతినిధులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాకు సహకారం అందించాలి.
– గోపాల్సింగ్తిలావత్, ప్రధానోపాధ్యాయుడు
హెచ్ఎం గోపాల్సింగ్ తిలావత్ పాఠశాలలో జరిగే అభివృద్ధి, తదితర కార్యక్రమాలపై మాతో చర్చిస్తారు. మా సలహాలు, సూచనలు తీసుకుంటారు. సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూస్తారు. ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతారు. ఉపాధ్యాయు లు పాఠాలు ఎలా చెబుతున్నారని అడిగి తెలుసుకుంటారు. పాఠశాల అభివృద్ధికి ఆయన చాలా కష్టపడి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.
– ముస్లే సుభాష్, ఉపాధ్యాయుడు